Monday, September 12, 2022

సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం....ఏడుగురి సజీవ దహనం

*సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.... ఏడుగురు మృతి!*

*ఏడుగురి సజీవ దహనం*

*మరో నలుగురి పరిస్థితి* *విషమంసికింద్రాబాద్‌ రూబీ ఎలక్ట్రిక్‌ షోరూంలో ఘటనషోరూంపైన రూబీ హోటల్‌కూ* *మంటలుఆ సమయంలో లాడ్జిలో పలువురి బసదట్టమైన పొగ.....*
మంటలతో ఉక్కిరిబిక్కిరికాలిన గాయాలతో కిందకు దూకిన పలువురుగాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు8 వాహనాలతో రంగంలోకి అగ్నిమాపక శాఖప్రాణాలకు తెగించి, పలువురిని కాపాడిన సిబ్బందిసెల్లార్‌లో బ్యాటరీల చార్జింగ్‌తోనే ప్రమాదం!భవనంలో అగ్నిమాపక పరికరాల లేమి?

హైదరాబాద్‌  సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ-స్కూటర్లు ఒక్కొక్కటిగా వరుసపెట్టి పేలడంతో.. ఆ ప్రాంతంలో భారీ శబ్దాలువచ్చాయి. చూస్తుండగానే దట్టమైన పొగ, మంటలు షోరూం పైన ఉన్న రూబీ హోటల్‌కు వ్యాపించాయి. హోటల్‌లో దిగిన పలువురు పొగలకు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే కొందరు సజీవ దహనం అయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకొందరు ప్రాణభయంతో పైనుంచి కిందకు దూకారు. తీవ్రగాయాలపాలై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కడపటి వార్తలందేసరికి ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బం ది, స్థానికుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఎదురు రోడ్డులో.. ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలో రూబీ ఎలక్ట్రికల్‌ షోరూం కొనసాగుతోంది. సెల్లార్‌లో ఆ షోరూం వాహనాల గోదాము ఉంది. రాత్రి 8.45 సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ ఈ-స్కూటర్‌ పేలిపోయింది. చూస్తుండగానే మంటలు ఇతర వాహనాలకు వ్యాపిం చి, ఒక్కొక్కటిగా పలు వాహనాలు భారీ శబ్దంతో పేలిపోయాయి. రాత్రి కడపటి వార్తలందేసరికి కూడా ఈ-స్కూటర్ల బ్యాటరీల పేలుళ్లు కొనసాగుతున్నాయి. ఆ సమయంలో గోదాములో ఎవరూ లేకున్నా.. పై అంతస్తుల్లో ఉన్న రూబీ హోటల్‌ గదులకు మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో హోటల్‌లో 25 మంది బసచేసినట్లు తెలుస్తోంది. వారిలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. దట్టమైన పొగ, మంటలతో ఉక్కిరిబిక్కిరైన మరో ఐదుగురు ప్రాణభయంతో కిందకు దూకారు.

ఆలోగానే వారికి మంటలంటుకున్నాయి. ఓ మహిళ సహా.. మరో ఆరుగురు కిందకు దూకలేక.. మెట్ల వైపు పరుగులు తీశారు. ఆ ప్రయత్నంలో వారికీ మంటలు అంటుకున్నాయి. ఐదుగురిని వేర్వేరు ఆస్పత్రులకు తరలించగా, ఆ మహిళ మృతిచెందినట్లు తెలిసింది. మరో ముగ్గురికి గాంధీ ఆస్పత్రి బర్నింగ్‌ వార్డ్‌లో చికిత్స అందజేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుంది. అయితే.. అప్పటికే షోరూం, గోదాము అగ్నికి ఆహుతయ్యాయి. హోటల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు 54 మీటర్ల నిచ్చెన ఉండే వాహనంతోపాటు.. 5 ఫైరింజన్లు, స్మోక్‌ ఇస్టింగ్విషర్‌ వాహనాలు, రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపారు. పైఅంతస్తుల్లోని హోటల్‌ గదుల్లో చిక్కుకుపోయిన 10 మందిని ఫైర్‌ ఆఫీసర్లు మోహన్‌రావు, ముస్తఫా, ప్రవీణ్‌ తమ బృందాలతో కలిసి ప్రాణాలకు తెగించి కాపాడారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ సంజయ్‌కుమార్‌ జైన్‌, ప్రాంతీయ అగ్నిమాక అధికారి వి.పాపయ్య, జిల్లా అగ్నిమాపక అధికారి మధుసూధన్‌, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సంఘటనాస్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. ''మొత్తం ఏడుగురు మృతిచెందారు. దట్టమైన పొగలతో ఊపిరి ఆడకే మరణాలు సంభవించాయి'' అని సీవీ ఆనంద్‌ వివరించారు.

ఒకవైపే

దారిరూబీ ఎలక్ట్రిక్‌ షోరూం, హోటల్‌ మొత్తం ఐదంతస్తుల్లో కొనసాగుతున్నాయి. అయితే.. ఆ హోటల్‌ భవనం నుంచి లోనికి వెళ్లడానికి, బయటకు రావడానికి ఒకే దారి ఉంది. భవనానికి సెట్‌ బ్యాక్స్‌లేవు. దీంతో.. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ఇబ్బంది పడ్డారు. సరిపడా అగ్నిమాపక వాహనాలు వచ్చినా.. ఒకవైపు నుంచే మంటలను ఆర్పాల్సి వచ్చింది. హోటల్‌ గదుల్లో ఏసీల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని ఫైర్‌ సిబ్బంది చెబుతున్నారు.

బ్యాటరీల చార్జింగ్‌ వల్లేనా?

షోరూం గోదాములో ఈ-స్కూటర్లను పార్క్‌ చేస్తారు. ఒక భాగంలో ఈ-స్కూటర్ల బ్యాటరీలను చార్జింగ్‌ చేస్తుంటారు. అక్కడే షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి.. ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

స్థానికుల చొరవ

ప్రమాదం జరిగిన దాదాపు 45 నిమిషాలకు గానీ ఫైరింజన్లు సంఘటన రాలేదని స్థానికులు చెబుతున్నారు. దాంతో సూర్య, సతీశ్‌ అనే యువకులు నిచ్చెనల సాయంతో హోటల్‌లో చిక్కుకున్నవారిని కాపాడే ప్రయత్నం చేశారు. చూస్తుండగానే.. మరికొందరు యువకులు, పోలీసులు వారికి తోడయ్యారు. తుకారంగేట్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ అంబటి ఆంజనేయులు కూడా ప్రాణాలకు తెగించి, రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అలా కొందరిని కిందకు తీసుకొచ్చామని, ప్రాణనష్టం తగ్గిందని మార్కెట్‌ పోలీసులు 'ఆంధ్రజ్యోతి'కి తెలిపారు. అంబటి ఆంజనేయులును హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ప్రత్యేకంగా అభినందించారు.

మంటలార్పేందుకు ప్రయత్నించినా..

షోరూం గోదాములో మంటలంటుకోగానే.. స్థానికులు షోరూంలో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేశారు. దాంతో వారు షోరూంలో అందుబాటులో ఉన్న అగ్నిమాపక పరికరాలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే.. కాసేపటికే వారి పరికరాల్లో మంటలను ఆర్పే వాయువు అయిపోవడంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. చూస్తుండగానే బ్యాటరీలు పేలిపోతూ.. మంటలు వేగంగా వ్యాప్తిచెందాయి.

ఏసీ గదులతో మంటల వ్యాప్తి

లాడ్జిలోని గదుల్లో దిగిన వారు ఏసీలు వేసుకోవడం కూడా మంటలు వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమై ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. నాలుగంతస్తుల హోటల్‌ల్లో మొత్తం 23 గదులు ఉన్నాయని, రాత్రి 12 గంటలకల్లా.. అన్ని గదులను పరిశీలించామని పేర్కొన్నారు. ఐదు మృతదేహాలను వెలికి తీశామని, పలువురు కిందికి దూకగా.. పైన చిక్కుకున్న 10 మందిని కాపాడామని పేర్కొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

No comments:

Post a Comment