Sunday, July 31, 2022

ప్రొఫైల్ పిక్ గా త్రివర్ణ పతాకాన్ని ఉంచండి..... ప్రధాని మోదీ పిలుపు

*ప్రొఫైల్ పిక్ గా త్రివర్ణ పతాకాన్ని ఉంచండి..... ప్రధాని మోదీ పిలుపు*

దిల్లీ: భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్న వేళ నిర్వహిస్తున్న 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌' వేడుక ప్రజా ఉద్యమంగా అవతరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 2-15వ తేదీల మధ్య ప్రతిఒక్కరూ తమ సోషల్‌ మీడియా ఖాతాల ప్రొఫైల్‌ పిక్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని పిలుపునిచ్చారు. ప్రతినెలా నిర్వహించే రేడియో ప్రసంగం మన్‌ కీ బాత్‌లో ఈ మేరకు ఆయన ప్రజలను కోరారు.

అలాగే, ఆగస్టు 13-15 మధ్య ఇంటింటా మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని ప్రధాని కోరారు. ఫలితంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఈ ఉత్సవాల్లో ఏదో రూపంలో పాల్గొంటున్నారని ఆయన అన్నారు.

* ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కర్ణాటకలో 'అమృత భారతి కన్నడర్తి' పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మోదీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 75 ప్రదేశాల్లో.. ఆయా ప్రాంతాలకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుల్ని స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించినట్లు వెల్లడించారు.

* స్వాతంత్ర్య పోరాటంలో రైల్వేల ప్రాముఖ్యతను వివరిస్తూ 'ఆజాదీ కా రైల్‌గాడీ' పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ప్రధాని పేర్కొన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 75 రైల్వే స్టేషన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు.

* మువ్వన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి ఆగస్టు 2నే అని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు నిండిన సందర్భంగా ఆయనకు ప్రత్యేక నివాళులర్పించారు. అలాగే త్రివర్ణ పతాక రూపకల్పనలో మేడం కామా కూడా కీలక పాత్ర పోషించినట్లు స్మరించుకున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

No comments:

Post a Comment