Sunday, January 29, 2023

సమరానికి సై.... పార్లమెంట్ లో భారాస వ్యూహంపై MP లకు కేసీఆర్ దిశా నిర్దేశం

సమరానికి సై.... పార్లమెంట్ లో భారాస వ్యూహంపై MP లకు కేసీఆర్ దిశా నిర్దేశం*

హైదరాబాద్‌: ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన భారాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై భారాస ఎంపీలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. దాదాపు 3గంటల పాటు జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని భారాస పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని, ప్రతి బడ్జెట్‌లోనూ వివక్ష ప్రదర్శిస్తున్నారని, ఆర్ధిక అంశాలపై ఆంక్షలు విధించడం, రైతుల విషయంలో వివక్ష చూపడం.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని సమావేశంలో నిర్ణయించారు.

తెలంగాణకు రావాల్సిన విభజన హామీలు, ప్రాజెక్టులు, ఆర్థిక పరమైన అంశాలపై రాజీలేని పోరాటం చేయడంతో పాటు, జాతీయ అంశాలపై కూడా స్పష్టమైన వైఖరితో వ్యవహరించాలని సీఎం కేసీఆర్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై ఎక్కడికక్కడ ఎండగట్టాలని పార్టీ ఎంపీలకు సూచించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను భాజపా కూలదోస్తోందన్న విషయాలను ప్రధానంగా ప్రస్తావించాలని, దానిపై చర్చ లేవనెత్తాలని సీఎం కేసీఆర్‌ సూచించినట్టు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరుపైనా ఎండగట్టాలని, సానుకూలంగా ఉన్న మిగతా పార్టీలతో కలిసి వీటన్నింటిపై వ్యూహాత్మకంగా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం గతంలో ఏవిధంగా పోరాడారో అలాగే పోరాడాడుతూ.. జాతీయ అంశాలపై కూడా దృష్టి పెట్టాలన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment