Monday, January 16, 2023

ప్రవాసుల మద్దతు గొప్పగా ఉంటుంది.... మంత్రి KTR....!

*ప్రవాసుల మద్దతు గొప్పగా ఉంటుంది.... మంత్రి KTR....!*

దావోస్‌: స్విట్జర్లాండ్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ దావోస్‌ వెళ్లారు. ఈ సందర్భంగా దావోస్‌ చేరుకున్న కేటీఆర్‌కు అక్కడి స్థానిక తెలుగువారు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం నిర్వహించిన 'మీట్‌ అండ్‌ గ్రీట్‌' కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

''దేశంలో ఉన్న వాళ్లతో పోల్చుకుంటే ప్రవాస భారతీయులకు దేశ వ్యవహారాలు, స్థానికంగా ఉన్న అంశాలు, అభివృద్ధి పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది. దావోస్ వచ్చిన ప్రతిసారీ స్విట్జర్లాండ్ నుంచి ప్రవాస భారతీయులు ఇచ్చే మద్దతు గొప్పగా ఉంటుంది. మానవ జీవితం పరిమిత కాలమనే సిద్ధాంతాన్ని నమ్మి, సాధ్యమైనంత ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేసే ప్రయత్నం చేస్తున్నాం. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఐటీ శాఖ వలన కొంత ప్రచారం లభిస్తోంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని శాఖలు అద్భుతమైన పనితీరుతో గొప్ప ప్రగతిని సాధిస్తున్నాయి. అన్ని రంగాల్లో రాష్ట్రం సమగ్ర, సమ్మిళిత, సమీకృత అభివృద్ధిని సాధించింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా తెలంగాణలోని పల్లెలు, పట్టణాలు సైతం దేశంలో ఆదర్శ గ్రామాలు, పట్టణాలుగా గుర్తింపు పొందాయి'' అని కేటీఆర్‌ పేర్కొన్నారు. అనంతరం ప్రవాస భారతీయులు నిర్వహించిన మకర సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించిన స్థానిక తెలుగువారికి కేటీఆర్‌ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.నేటి నుంచి ఐదు రోజుల పాటు దావోస్‌ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరగనుంది. 'విచ్ఛిన్నమైన ప్రపంచానికి సహకారం'' అనే అంశంపై ఈ సదస్సును నిర్వహించనున్నారు. దాదాపు 52 దేశాల అధినేతలు, 130 దేశాలకు చెందిన 2,700 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరుకానున్నారు. ఆర్థిక, ఇంధన, ఆహార సంక్షోభాల పరిష్కారంపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చకు రానుంది. ప్రపంచ ఆర్థిక సదస్సుకు భారత్‌ నుంచి కేంద్ర మంత్రులు మున్‌సుఖ్‌ మాండవీయ, అశ్వీనీ వైష్ణవ్‌, స్మృతి ఇరానీ, ఆర్‌కే సింగ్‌, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే, పలువురు సీఎంలు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌, ఇతర ప్రతినిధులు హాజరుకానున్నారు

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment