Friday, January 13, 2023

ప్రభుత్వ ఆసుపత్రికీ చికిత్సకోసం వచ్చి ఇద్దరు బాలింతల.... మృతి

*ప్రభుత్వ ఆసుపత్రికీ చికిత్సకోసం వచ్చి ఇద్దరు బాలింతల.... మృతి*

మలక్‌పేట: హైదరాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం వచ్చి ఇద్దరు బాలింతలు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు బాలింతల మృతితో నగరంలోని మలక్‌పేట్‌ ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వైద్యుల నిర్లక్ష్యంతోనే వారు చనిపోయారంటూ బాధితుల కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.

వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లి గ్రామానికి చెందిన మహేశ్‌.. తన భార్య సిరివెన్నెల (23)తో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. మహేశ్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్యను ఇటీవల కాన్పు కోసం మలక్‌పేట్‌ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆపరేషన్ చేసి వైద్యులు కాన్పు చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అస్వస్థతకు గురికావడంతో వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సిరివెన్నెల ప్రాణాలు కోల్పోయింది. మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందంటూ ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని చాదర్‌ఘాట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్ద బైఠాయించారు.మరోవైపు తిరుపతికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ జగదీశ్‌.. తన భార్య శివాణిని ఈ నెల 9న మలక్‌పేట్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో శివాని బాబుకు జన్మనిచ్చిన అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో మలక్‌పేట్‌ ఆస్పత్రి వైద్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివాని కూడా ప్రాణాలు కోల్పోయింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment