Friday, March 8, 2024

రాజ్యసభ కు సుధా మూర్తిని -నామినేట్ చేసిన రాష్ట్రపతి

*రాజ్యసభ కు సుధా మూర్తిని -నామినేట్ చేసిన రాష్ట్రపతి*

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్‌ చేసినట్లు ప్రధాని నరేంద్రమోదీ 'ఎక్స్‌ (ట్విటర్‌)' వేదికగా వెల్లడించారు.మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడటం విశేషం.

ఈ సందర్భంగా పలు రంగాల్లో సుధామూర్తి విశేష కృషిని ప్రధాని కొనియాడారు. ''సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో పాటు విభిన్న రంగాల్లో ఆమె చేసిన కృషి అపారం, స్ఫూర్తిదాయకం. ఆమె రాజ్యసభకు నామినేట్‌ అవడం 'నారీశక్తి'కి బలమైన నిదర్శనం. దేశ నిర్మాణంలో మన మహిళల శక్తి సామర్థ్యాలను చాటిచెప్పడానికి చక్కటి ఉదాహరణ. ఆమె పార్లమెంటరీ పదవీకాలం ఫలప్రదమవ్వాలి'' అని మోదీ ఆకాంక్షించారు.
73 ఏళ్ల సుధామూర్తి ప్రస్తుతం 'మూర్తి ట్రస్ట్‌'కు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. రచయిత్రిగా, విద్యావేత్తగా, వితరణశీలిగా దేశవ్యాప్తంగా సుపరిచతమే. ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. పలు అనాథాశ్రయాలను నెలకొల్పారు. గ్రామీణాభివృద్ధికి, విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్‌, గ్రంథాలయ వసతులు కల్పించారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2006లో కేంద్రం పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది.

*V.S. జీవన్*

No comments:

Post a Comment