తేదీ: 31.12.2025
ప్రెస్ నోట్
జగిత్యాల: జిల్లా మెట్పల్లి లో బయటపడ్డ భారీ 'హనీ ట్రాప్' ముఠా.. రౌడీ షీటర్ నేతృత్వంలో విచ్చలవిడి దందా!.........
ఉచ్చులో పడితే నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ - ముగ్గురు నిందితుల అరెస్ట్, ముగ్గురు పరారీ……...
వ్యాపారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు - రౌడీ షీటర్ సహా ముగ్గురు కటకటాల్లోకి.
మెట్పల్లి (నేర విభాగం): అమాయక వ్యక్తులను, ముఖ్యంగా ధనవంతులను టార్గెట్ చేస్తూ మహిళలతో వల వేసి, ఏకాంతంగా ఉన్న సమయంలో నగ్న వీడియోలు తీసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ఒక ప్రమాదకరమైన హనీ ట్రాప్ ముఠాను మెట్పల్లి పోలీసులు ఛేదించారు. ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్న రౌడీ షీటర్ కోరుట్ల రాజుతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
కేసు వివరాలు:
పోలీసుల కథనం ప్రకారం.. మెట్పల్లి దుబ్బవాడకు చెందిన కోరుట్ల రాజ్కుమార్ అలియాస్ రాజుపై గతంలోనే పలు కేసులు ఉండటంతో పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో రాజు, భర్తకు దూరంగా ఉంటున్న బలుమూరి స్వప్న అనే మహిళతో చేతులు కలిపాడు. వీరిద్దరితో పాటు బట్టు రాజశేఖర్, సుంకిటి వినోద్, పులి అరుణ్, మాగని దేవా నర్సయ్యలు ఒక ముఠాగా ఏర్పడ్డారు.
నేర ప్రవృత్తి:
మెట్పల్లి హనుమాన్ నగర్లోని బచ్పన్ స్కూల్ సమీపంలో ఒక గదిని అద్దెకు తీసుకున్న ఈ ముఠా, మహిళల పట్ల బలహీనత ఉన్న ధనవంతుల ఫోన్ నంబర్లు సేకరించేవారు. స్వప్న వారితో ఫోన్లో కవ్వించి మాట్లాడుతూ తన గదికి రప్పించేది. బాధితులు లోపలికి వెళ్లి నగ్నంగా ఉన్న సమయంలో, నిందితులు ఒక్కసారిగా గదిలోకి ప్రవేశించి సెల్ ఫోన్లలో వీడియోలు తీసేవారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి లక్షలాది రూపాయలు వసూలు చేసేవారు. ఇప్పటికే ఈ ముఠా పలువురిని బ్లాక్ మెయిల్ చేసినట్లు విచారణలో తేలింది.
తాజా ఘటన:
మూడు నెలల క్రితం మెట్పల్లికి చెందిన ఒక వ్యాపారిని టార్గెట్ చేసిన ఈ ముఠా, ఈ నెల 28న ప్లాన్ ప్రకారం గదికి పిలిపించి నగ్న వీడియోలు తీసింది. విషయం బయటకు రాకుండా ఉండాలంటే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. బాధితుడు ధైర్యంతో పోలీసులను ఆశ్రయించడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది.
అరెస్టయిన వారు:
* కోరుట్ల రాజ్కుమార్ (రౌడీ షీటర్)
* మాగని దేవా నర్సయ్య
* బలుమూరి స్వప్న
పరారీలో ఉన్న వారు:
* బట్టు రాజశేఖర్ (ఎర్దండి)
* సుంకిటి వినోద్ (ములరంపూర్)
* పులి అరుణ్ (మెట్పల్లి) (రౌడీ షీటర్)
స్వాధీనం చేసుకున్నవి: నిందితుల నుండి 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో గతంలో వారు చేసిన బ్లాక్ మెయిల్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, ఇటువంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెట్పల్లి పోలీసులు హెచ్చరించారు.
సి.ఐ. హెచ్చరిక:
ఈ సందర్భంగా సి.ఐ. వి. అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ, సోషల్ మీడియా లేదా అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ఎవరైనా ఇటువంటి వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. ఈ ముఠా గుట్టు రట్టు చేసిన సి.ఐ. మరియు వారి బృందాన్ని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
ఇట్లు
ఎస్సై, మెట్ పల్లి..
No comments:
Post a Comment