ఎస్ ఎల్ బీ సీ పనుల పునరుద్దరణ వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు. ఒక్క రోజు కూడా ఆలస్యం కావడానికి వీలు లేదని చెప్పారు. ఈ టన్నెల్ ప్రాజెక్ట్ ఫ్లోరోసిస్ పీడిత నల్గొండ జిల్లాకే కాకుండా తెలంగాణ కు అత్యంత కీలకమని.. అందుకే ప్రణాళిక ప్రకారం.. అత్యంత నైపుణ్యం తో ఈ పనులు చేపట్టాలని సూచించారు.
ప్రపంచ స్థాయి అత్యాధునిక సాంకేతిక నైపుణ్యం తో పనులు చేపట్టాలని నిర్ణయించారు. గతం లో జరిగిన తప్పులు, లోటు పాట్లు పునరావృతం కాకుండా పక్కడ్బందీగా అత్యంత భద్రంగా రక్షణ చర్యలు చేపట్టి ముందుకు సాగాలని చెప్పారు. అనుభవం ఉన్న ఆర్మీ అధికారుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. సర్వే తో పాటు పనులు పూర్తి అయ్యేంత వరకు ఆయా రంగాల్లో నిష్ణాతులైన అన్ని ఏజెన్సీల సలహాలు సూచనలతో.. వారి భాగస్వామ్యం తో యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగించాలని అదేశించారు.
గురువారం సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సలహాదారులు అదిత్యా దాస్ నాద్, ఇండియన్ ఆర్మీ రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ఛీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్ పాల్ సింగ్, స్పెషల్ సెక్రటరీ, ఇండియన్ ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మెహరా, ఇ.ఎన్.సి లు అంజత్ హుస్సేన్, ఎన్జీఆర్ఐ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్, చీఫ్ సైంటిస్ట్ హెచ్వీఎస్ సత్యనారాయణ, జీఎస్ఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కేవీ మారుతి, డైరెక్టర్ శైలేంద్ర కుమర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్ లో దేశ విదేశాల్లో చేపట్టే టన్నెల్ ప్రాజెక్ట్ లకు ఆదర్శంగా ఉండేలా ఎస్ఎల్బీసీ నిర్మాణం పూర్తి చేయాలని.. ఇదొక కేస్ స్టడీ గా ఉండాలని అకాంక్ష ను వెలిబుచ్చారు. ప్రభుత్వం తరఫున అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుందని భరోసా ఇచ్చారు. వెంటనే అటవీ శాఖ, ఇంధన శాఖ ఇరిగేషన్ విభాగంతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులను ముఖ్య మంత్రి అదేశించారు. ఎస్ఎల్బీసీ పునరుద్దరణ పనులకు అవసరమైన అన్ని అనుమతులు, నిర్ణయాలు తీసుకునేందుకు ఈ నెల 15 లోగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని ఆదేశించారు. వెంటనే సంబంధిత విభాగాల అధికారుల స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.
ఒక్క సమావేశం లోనే అన్ని సమస్యలకు పరిష్కారం తీసుకు రావాలని నిర్ణయించారు. అటవీ శాఖ అనుమతులపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని.. ఎస్ ఎల్ బీ సీ పనులకు నిరంతరాయం గా విద్యుత్ సరఫరా జరగాలని..సొరంగం తొవ్వకం లో సింగరేణి నిపుణుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఎస్ ఎల్ బీ సీ ఏళ్లకేళ్లుగా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న కలల ప్రాజెక్ట్ .. ఎలాంటి ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వడానికి ఎస్ ఎల్ బీ సి లో అవకాశం ఉందని ముఖ్య మంత్రి అన్నారు.
2027 డిసెంబరు 9 లోగా ఎస్ ఎల్ బీ సీ ని పూర్తి చేయాలని, 2027 డిసెంబర్ 9 న తెలంగాణ ప్రజలకు అంకితం చేయాలని సీఎం గడువు నిర్ణయించారు. గడువు లోగా పనులు పూర్తి చేసేందుకు ప్రతి మూడు నెలల ప్లానింగ్ సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.
సొరంగం పనులను వేగంగా పూర్తి చేసేందుకు కాంట్రాక్టు సంస్థ జేపి అసోసియేట్స్ అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాలని.. కాంట్రాక్టు సంస్థ ఒక్క రోజు పనులు ఆలస్యం చేసినా ఒప్పుకునేది లేదని సీఎం అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎస్ ఎల్ బీ సీ పూర్తి కావాలి..పనులు ఆగడానికి వీలు లేదని చెప్పారు. ఇన్లెట్ వైపు నుంచి ఔట్లెట్ వైపు.. రెండు వైపుల నుంచి పనులు చేపట్టాలని.. అందుకు అవసరమైన యంత్ర పరికరాల తో పాటు సరిపడేంత మంది నిపుణులు, కార్మికులను రంగం లోకి దింపాలని సూచించారు.
ఎస్ ఎల్ బీ సీ పనులకు గ్రీన్ ఛానల్ లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మొత్తం 44 కిలోమీటర్ల సొరంగమార్గానికి గాను ఇప్పటికే 35 కిలో మీటర్ల సొరంగం తవ్వడం పూర్తి అయ్యిందని మిగిలిన తొమ్మిది కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వడానికి గాను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించ బోతున్నట్లు ఈ సందర్భంగా పరీక్షిత్ మోహ్ర వివరించారు. ప్రతి నెల 178 మీటర్ల సొరంగం తవ్వడం లక్ష్యంగా పెట్టుకుని జనవరి 2028 నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికతో కూడిన హెలీ-బోర్న్ సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్(NGRI) ద్వారా ఈ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో సొరంగం తవ్వకాల సమయంలో ముందుగానే ప్రమాదాలను పసిగట్టే వీలుంటుందని తెలిపారు.
No comments:
Post a Comment