Thursday, January 4, 2024

ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ బస్తీ లో నాయకుల దురాక్రమణని అడ్డుకోవాలి

*ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ బస్తీ లో నాయకుల దురాక్రమణని అడ్డుకోవాలి*


ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ అనబడే బస్తీ యొక్క ప్రజలను గత కొద్ది సంవత్సరాలుగా రాజకీయనాయకులు ఆ భూమిని అప్పగించవలసిందిగా భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఈ విషయం మీద జనవరి 2వ 2024 రోజు బస్తీ ప్రజలు ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమంలో నివేదికని సమ్పార్పించిన విషయం మీడియా లో రావడం వలన మానవ హక్కుల వేదిక హైదరాబాద్ యూనిట్ బృందం జనవరి 3వ తారీఖున నిజనిర్ధారణ జరిపింది. 

బాలానగర్ మండలం, బేగంపేట్ దగ్గరి ప్రకాష్ నగర్ కాలనీ పక్కన ఉన్న ఈ భూమి జలాలుద్దీన్ ఖాన్ అనే వ్యక్తికి చెందినది. ఆ భూమి నిజాం కాలం నుంచి వారి వంశస్థుల ఆధీనంలో ఉంది. అతని భూమిలో కొంత భాగం సర్వే నెంబర్ 194/8/1 లో ఈ బస్తీ నెలకొంది ఉంది. ఈ బస్తీ లో ప్రస్తుతం ఉన్న 300 కి పైగా కుటుంబాలు 182 ఇళ్లలో ఉన్నారు. ఈ స్థలం దశాబ్దాలుగా చాలా చేతులు మారింది. వీరందరికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు ఉన్నాయి. బస్తీలో మంచి రోడ్లు కూడా వేయడం జరిగింది. ఇంటి పన్ను కూడా కడుతున్నారు. బస్తీ వైశాల్యం ఒక ఎకరం ఉంటుంది. 

ఈ సర్వే నెంబర్ భూమికి పక్కన ఉన్న సర్వే నెంబర్ 184,185,186 లలో దాదాపు మూడు ఎకరాల భూమి ఉంది. ఈ బస్తీ భూమిని కూడా కలుపుకుని అపార్టుమెంట్లు కట్టి అమ్ముకోవాలని కొంతమంది బిల్డర్స్ ఆలోచన. వీరికి రాజకీయ నాయకుల మద్దతు ఉంది. మాజీ మంత్రి దానం నాగేందర్ అనుచరులు ఈ బస్తీ వాసులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. బస్తీలో ఎప్పుడూ కొంతమంది కాపు కాయడం,  రాత్రి పూట ప్రజలు మీద దాడి చెయ్యడం, ఇళ్లపై రాళ్లు రువ్వడం, బస్తీ ఖాళీ చేసి వెళ్లిపొమ్మని బెదిరించడం బాగా జరిగింది. ఈ విషయం మీద బేగంపేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వెళ్లిన బస్తీవాసులను, పోలీసు వారు నిరాశ పరిచి, కంప్లైన్ట్ తీసుకోకుండా, బస్తీ వాసులు ఈ పోరాటం గెలవలేరని  వారు భూమి ఇచ్చేయడం మంచిదని ఉచిత సలహా ఇచ్చి పంపించేవారు. 

2022 సంవత్సరంలో పైవేటు వ్యక్తులు బుల్డోజర్ల సహాయంతో 8 ఇళ్లను కూల్చివేయడం జరిగింది.  బస్తీ ప్రజలు హై  కోర్టును ఆశ్రయించగా, WPS నెంబర్ 37279, 37392, 37587 status quo తీర్పు ఇచ్చింది, అయినా సరే, దానం నాగేందర్ అనుచరుడిగా గుర్తింపు ఉన్న సుధీర్ గౌడ్ ఆధ్వార్యంలో బస్తీ ప్రజలను భయపెట్టడం ఆగలేదు.జనవరి మూడవ తారీఖు ప్రజావాణిలో నివేదిద్దామని వెళ్లిన బస్తీ వాస్తులను సుధీర్ గౌడ్ మనిషి వారిని అనుసరరిస్తూ అతని మీద ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. 

బస్తీకి రెండు వైపులా ఉన్న చెరువులలో ఒక చెరువు కబ్జాకి గురి అయ్యి, శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా అపార్ట్మెంట్ నిర్మాణం జరిగింది. ఇంకో వైపు ఉన్న చిన్న చెరువు కూడా కబ్జాకి గురి అయ్యింది. మరో వైపు ఉన్న భూమిలో బస్తీకి భూమిని కూడా కలుపుకుని నిర్మాణాలు కొనసాగించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి రాజకీయ అండదండలు ఉన్నాయి. భూమి రికార్డులలో ఉన్న అవకతవకలు, చెరువుల రక్షణ ప్రభుత్వం చేపట్టకపోవడం, ప్రభుత్వ భూమిని గుర్తించకపోవడం, ఇవన్నీ కూడా పేదవారికి భారం అవుతున్నాయి.

మానవ హక్కుల వేదిక హైదరాబాద్ యూనిట్ ఉపాదాధ్యక్షులు శ్రీ బిలాల్ మరియు ప్రధాన కార్యదర్శి సంజీవ్ ఈ బృందంలో పాల్గొన్నారు. 

డిమాండ్లు 

*జిల్లా కలెక్టర్ విచారణ జరిపి ఆ బస్తీ వాసులకు చట్టరీత్యా నివాస హక్కులు కల్పించాలి.
*బస్తీ వాసులకు రౌడీల నుండి పోలీస్ కమిషనర్ పూర్తి రక్షణ కల్పించాలి.
*మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాత్రపై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలి.
Courtesy / Source by : hrf Hyderabad unit 

No comments:

Post a Comment