గుడ్ న్యూస్ ,
సేవలు అందిస్తున్న వారి కోసం
ఒక సంక్షేమం చట్టం వస్తోంది
కన్నెగంటి రవి,
తెలంగాణ పీపుల్స్
జాయింట్ యాక్షన్ కమిటీ,
ఫోన్: 99129 28422
-------------------------------------------
ఎండా, వానా, చలీ అనుకోకుండా రద్దీ ట్రాఫిక్ లో వేగవంతమైన బైక్ ప్రయాణంతో ఎక్కే గడపా, దిగే గడపా గా జీవనోపాధి ఎంచుకున్న వీళ్ళు ఎవరసలు ? మన జీవితంలో ఎలా భాగ మయ్యారు? వాళ్ళ జీవితాలేమిటి ? వాళ్ళ ఆదాయాలేమిటి? వాళ్లకున్న సమస్యలేమిటి ? వారి కున్న హక్కులేమిటి ? మనం ఎప్పుడైనా ఆలోచించామా ?
సాధారణంగా వీళ్ళను గిగ్ మరియు ప్లాట్ ఫారం కార్మికులంటారు. అమెరికా, యూరప్ లలో "gig" అంటే, డిక్షనరీ అర్థం ప్రకారం, చిన్న స్వతంత్ర పని లేదా ఒప్పంద ఆధారిత ఉద్యోగం. నిజానికి భారత దేశంలో app ఆధారితంగా జరుగుతున్న పనులను అంతా తక్కువ కాలానికి,తాత్కాలిక ప్రాతిపదికన ఎవరూ ఎంచుకోవడం లేదు. ఎక్కువమంది ఈ కార్మికులు రోజుకు 12 నుండీ 14 గంటల పాటు పని చేస్తున్నారు. కొన్ని app ఆధారిత కంపనీలు, “రోజుకు 14 గంటలు పని చేయండి, కేవలం 6 గంటలు నిద్రపోండి, నెలకు 50,000 సంపాదించండి” లాంటి వాణిజ్య ప్రకటనలను అధికారికంగానే విడుదల చేస్తున్నాయి. వీరి విషయంలో 8 గంటల పని దినం అనేది అసలు లేకుండా పోయింది.
ప్లాట్ ఫారం అంటే, ఏదో ఒక app ఆధారంగా పని చేయడం.ఇప్పటికే తెలంగాణ లో app ఆధారిత ప్రధాన కంపనీలు 10 కి పైగా ఉన్నాయి. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ రంగంలో స్విగ్గి, జొమాటో, రైడ్ షేరింగ్ రంగంలో ఓలా, ఊబర్, రాపిడో , పోర్టర్, ఇతర e –కామర్స్ , గ్రాసరి డెలివరీ రంగంలో అమెజాన్,బిగ్ బాస్కెట్,బ్లింక్ ఇట్,ఫ్లిప్ కార్ట్, మంత్ర, ఇతర సర్వీసుల రంగంలో అర్బన్ కంపనీ లాంటి పెద్ద కంపనీలు ఉన్నాయి. హైదరాబాద్ కే పరిమితం కాకుండా , కొన్ని కంపనీలు, కొన్ని 2 టైర్ సిటీలకు కూడా తమ బిజినెస్ సేవలను విస్తరించాయి.
ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోయి, వ్యవసాయ రంగంలో సంక్షోభం ఏర్పడి, పారిశ్రామిక రంగం కూడా కుదేలైన దశలో, ముందుకు వచ్చిన ఈ ప్లాట్ ఫారం రంగంలో పని చేసుకోవడం తప్ప రాష్ట్ర యువతకు మరో మార్గం లేకుండా పోయింది. అందుకే అన్ని కులాలకు, మతాలకు చెందిన యువకులు, యువతులు, విద్యార్ధులు కూడా ఈ రంగంలో ఉపాధి కోసం పరుగు లెత్తుతున్నారు. ఇతర రాష్ట్రాల నుండీ వచ్చిన వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఈ రంగంలో పనులు పొందుతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇలా app ఆధారిత పనులు చేసుకుంటున్న వారి సంఖ్య 4,20,000 వరకూ ఉంటుందని ఒక అంచనా.
ఎంత పని చేసినా, ఈ కార్మికులు 15 నుండీ 18, 000 సంపాదిస్తే, లేదా రైడ్ షేరింగ్ కార్మికులు 20,000 నుండీ 25,000 సంపాదించడం గగనంగా మారిపోయింది. పెట్రోల్, డీజిల్ ఖర్చులు,బండి మెయింటెనెన్స్, ట్రాఫిక్ చాలానా లు కట్టాక, కంపనీకి కమిషన్ చెల్లించాక, ఈ కార్మికులకు మిగిలేది చాలా తక్కువ. నిజానికి వేరికి నిర్ధిష్ట వేతనాలు లేవు. నెలకు కనీస ఆదాయానికి గ్యారంటీ లేదు.
తెలంగాణ రాష్ట్రం లోకి ఓలా, ఊబర్ లాంటి కంపనీలు వచ్చి పదేళ్ళు దాటిపోతున్నా, ఇప్పటికీ, కిలో మీటర్ కు 10-11 రూపాయలకు మించి దొరకడం లేదు. కంపనీలు వినియోగదారుల నుండీ సర్ ఛార్జీలు వసూలు చేసినా , ఎక్కువలో ఎక్కువ కిలో మీటర్ కు 14 రూపాయలకు మించి దొరకడం లేదు. నిజానికి హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రీ పెయిడ్ టాక్సీలకు కిలో మీటర్ కు 21 రూపాయలు చెల్లించేలా జీవో ఉంది. కానీ విమానాశ్రయానికి బయట, ఆ ఛార్జీలు కార్మికులకు లభించడం లేదు. అందుకే బాయ్ కాట్ ఎయిర్ పోర్ట్, బాయకట్ ఏసీ లాంటి నినాదాలతో కార్మికులు ఉద్యమాలు కూడా సాగించారు.
కంపనీలు వీళ్ళను కార్మికులుగా గుర్తించవు కాబట్టి, ఇతర రంగాల కార్మికుల కోసం దశాబ్ధాలుగా పని చేస్తున్న కార్మిక సంఘాలు కూడా వీరిని కూడా కార్మికులుగా గుర్తించి, వారి ప్రత్యేక సమస్యలపై పని చేయడం లేదు.
కానీ, దశాబ్ధ కాలం క్రితమే ఒక హైదరాబాద్ కుర్రాడు వీళ్ళ గురించి ఆలోచించాడు. మూడేళ్ల పాటు వీరి జీవితాలను లోతుగా పరిశీలించాడు. తాను కూడా ఈ వృత్తిలో భాగంగా జీవనోపాధిని ఎంచుకుని కుటుంబాన్ని పోషించుకుంటూనే, తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ కోసం ఒక సంఘమే పెట్టాడు. ఆ కుర్రాడే షేక్ సలావుద్దీన్. తాను పెట్టిన సంఘమే తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫారం వర్కర్స్ యూనియన్. హిందీలో, తెలుగులో గలగలా మాట్లాడే ఈ కుర్రాడు ఇప్పుడు దేశంలో , రాష్ట్రంలో గిగ్ అండ్ ప్లాట్ ఫారం వర్కర్స్ సమస్యలపై గొంతెత్తి మాట్లాడుతున్నాడు. వివిధ రాష్ట్రాలలో వీళ్ళ కోసం నూతనంగా చట్టాలను తేవడానికి ఇతర సామాజిక కార్యకర్తలతో కలసి, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చిస్తున్నాడు.
రాహుల్ గాంధీ సాగించిన భారత్ జోడో యాత్రలో తాను కూడా భాగస్వామిగా చేరి, రాహుల్ గాంధీకి గిగ్ అండ్ ప్లాట్ ఫారం కార్మికుల సమస్యలు అర్థమయ్యేలా వివరించాడు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినా, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న చోట, ఈ కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. రాహుల్ గాంధీకి యాత్ర పొడవునా, వివిధ రాష్ట్రాలలో కార్మికులను కల్పించి సలావుద్దీన్ చేసిన ఈ ప్రయత్నం రాజస్థాన్ చేరే నాటికి ఒక రూపం దాల్చింది. కేవలం రాజకీయ నాయకులతో లాబీ చేయడమే కాదు, అనేక ఆందోళనలు, ధర్నాలు కూడా చేసి ఈ కార్మికుల సమస్యలను ప్రజల దృష్టికి , ప్రభుత్వాల దృష్టికి 10 వేల మంది సభ్యత్వం కలిగిన తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫారం వర్కర్స్ యూనియన్ తీసుకు వచ్చింది.
ఈ సందర్భంగా రవాణా,ఆహారం,మరియు కొరియర్ డెలివరీ, లాజిస్టిక్స్, గృహ ఆధారిత సేవలు,వృత్తిపరమైన సేవలు,ఆరోగ్య సంరక్షణ వంటి అన్ని రంగాలలోని గిగ్ అండ్ ప్లాట్ ఫారం కార్మికుల హక్కులను రక్షించాలని, ఈ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా నమోదు చేసుకునే అవకాశం ఉండాలని, ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ID ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వమ్ ఈ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు, సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని, ఈ బోర్డు ద్వారా, కార్మికులు సామాజిక బధ్రత పథకాలను పొందే వీలుండాలని, అగ్రిగేటర్లు, ప్లాట్ ఫారం సంస్థలు,రేటింగ్ లు, కార్మికుల వర్గీకరణకై ,ఉపయోగించే అల్గారిథం మేనేజ్ మెంట్ లో పారదర్శకత ఉండాలని, ఈ సమాచారాన్ని, అగ్రిగేటర్లు సేకరించిన కార్మికుల వ్యక్తిగత సమాచారాన్ని కార్మికులు యాక్సెస్ చేయగలగాలని యూనియన్ కోరుతున్నది.
కార్మికులు సురక్షితమైన పని వాతావరణాన్ని కలిగి ఉండాలని,కార్యాలయంలో వారి బద్రతకు ఎటువంటి రిస్క్ ఉండకూడదని, అగ్రిగేటర్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కార్యాలయ బధ్రత, ఆరోగ్య ప్రమాణాలను పాటించాలని యూనియన్ కోరింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం పొందే హక్కు కార్మికులందరికీ ఉండాలని, యాప్ ఆధారిత డ్రైవర్స్ కు ఏక రూప చార్జీల వంటి చర్యల ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ బద్రతను నిర్ధారించాలని, ఫిర్యాదులను నివేదించడం, పరిష్కరించడం కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, దాని ముందుకు వెళ్ళే హక్కు కార్మికులందరికీ ఉండాలని, కార్మికులు ఆన్లైన్ లో, లేదా నిర్దేశిత అధికారి ముందు ఫిర్యాదు చేసే అవకాశం ఉండాలని, కార్మికులు, పారిశ్రామిక వివాదాల చట్టం 1947 క్రింద పరిష్కారాన్ని పొందగలగాలని యూనియన్ కోరుతున్నది.
అగ్రిగేటర్లు చెల్లుబాటయ్యే కారణాలను లిఖిత పూర్వకంగా ఇవ్వకుండా,14 రోజుల ముందు నోటీసు ఇవ్వకుండా కార్మికుడిని తొలగించకూడదని, కార్మికులందరికీ న్యాయమైన పని నిబంధనలు మరియు షరతులు ఉండాలని, అగ్రిగేటర్లు కాంట్రాక్టులో ఏవైనా మార్పులు చేయడానికి కనీసం 14 రోజుల ముందు కార్మికులకు తెలియచేయాలని కూడా యూనియన్ కోరుతున్నది.
రాజస్థాన్ లో MKSS సంస్థ బాధ్యులు గా ఉన్న సామాజిక కార్యకర్త నిఖిల్ డే బృందంతో కలసి సలావుద్దీన్, అక్కడి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతర చర్చలు జరిపి, ఒక చట్టాన్ని ఆమోదించేలా చేశారు. దేశం మొత్తంలోనే గిగ్ అండ్ ప్లాట్ ఫారం కార్మికుల కోసం వచ్చిన మొదటి చట్టం ఇది.
తాజాగా రాహుల్ గాంధీ సహకారంతో, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, ఈ కార్మికుల కోసం ఒక ఆర్డినెన్స్ తెచ్చేలా విజయం సాధించారు. తన స్వంత రాష్ట్రం తెలంగాణ లో కూడా ఇతర రాష్ట్రాలకు మించి గిగ్ అండ్ ప్లాట్ ఫారం కార్మికుల కోసం ఒక మంచి చట్టం తేవడానికి సలావుద్దీన్, ఇతర సామాజిక కార్యకర్తలతో కలసి చేసిన కృషి కూడా ఒక రూపం దాల్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక డ్రాఫ్ట్ చట్టాన్ని రూపొందించి, ప్రజల అభిప్రాయాల కోసం పబ్లిక్ డొమైన్ లో ఉంచింది.
ఏప్రిల్ చివరి వారంలో చట్టాన్ని ఆమోదించి, మే 1 నుండీ కొత్త చట్టాన్ని అమలు చేయాలనే ప్రయత్నంలో ఉంది.
చివరి దశలో యాజమాన్యాలు అడ్డు పడకుండా ఉంటే, చట్టంతో పాటు, ఈ కార్మికుల కోసం ఒక సంక్షేమ బోర్డు కూడా ఉనికి లోకి వచ్చే అవకాశం ఉంది. లక్షాలది మంది గిగ్ అండ్ ప్లాట్ ఫారం కార్మికుల సంక్షేమానికి ఉపయోగపడే చట్టం, సంక్షేమ బోర్డు అమలు లోకి రావాలని, 2035 నాటికి app ఆధారిత సేవలను కంపనీలు రాష్ట్రమంతా విస్తరించే నాటికి, ఈ రాష్ట్ర కార్మికులకు ఈ చట్టంపై అవగాహన పెంచాలని, బలంగా కోరుకుంటున్న షేక్ సలావుద్దీన్ లాంటి సామాజిక కార్యకర్తల కల నెరవేరాలని కోరుకుందాం. రాష్ట్రంలో ఉన్న ఇతర కార్మిక సంఘాలు కోల్పోతున్న కార్మికుల హక్కులను కాపాడుకోవడానికి ఈ కృషిని, చట్టాన్ని స్పూర్తిగా తీసుకుంటాయని ఆశిద్ధామ్.
No comments:
Post a Comment