Monday, August 31, 2026

"50,565 ఎకరాలు మరియు లక్ష ఇళ్లు ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నాయా? అయితే పూర్తి జాబితాను బహిర్గతం చేయండి"_

*ప్రెస్ నోట్*

*“50,565 ఎకరాలు మరియు లక్ష ఇళ్లు ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నాయా? అయితే పూర్తి జాబితాను బహిర్గతం చేయండి”*

*ప్రజలకు నిజం తెలుసుకునే హక్కు ఉంది - వి. రవికృష్ణ న్యాయవాది*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 30:

మాజీ మంత్రి టి. హరీశ్‌రావు మరియు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇటీవల సుమారు 50,565 ఎకరాల వ్యవసాయ భూములు, దాదాపు లక్ష ఇళ్లు సెక్షన్ 22-A ప్రొహిబిటెడ్ లిస్టులో చిక్కుకున్నాయని ఆరోపిస్తూ, వాటిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. సమస్య పరిష్కారం కాకపోతే సంగారెడ్డి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని కూడా హెచ్చరించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వ రికార్డులు ఏమి చెబుతున్నాయో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.నేను అమీన్‌పూర్ మరియు పటాన్‌చెరు మండలాలకు సంబంధించిన సమీకృత ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ రికార్డులను సర్వే నంబర్ వారీగా పరిశీలించాను.
*ఆ రికార్డుల ప్రకారం:*

**అమీన్‌పూర్ మరియు పటాన్‌చెరు మండలాలు**

*(1)*: వ్యవసాయ భూములు: 1,631.6690 ఎకరాలు.
*(2)*:  వ్యవసాయేతర భూములు / ప్లాట్లు: 673.3775 ఎకరాలు.
*(3)*: మొత్తం: 2,305.0465 ఎకరాలు.
అంటే మొత్తం విస్తీర్ణం సుమారు 1,11,56,425.06 చదరపు గజాలు.
*అయితే ఇక్కడ మరో ముఖ్యమైన అంశాన్ని ప్రజలు గమనించాలి.*
ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్న ప్రతి ఆస్తిని  *“ప్రైవేట్ వ్యవసాయ భూమి”* గా పేర్కొనడం సరైనది కాదు. రికార్డుల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ , ఇరిగేషన్ –శిఖం (వాటర్ బాడీస్ ), అసైన్డ్ ల్యాండ్స్ తదితర విభిన్న వర్గీకరణలు ఉన్నాయి.
అందువల్ల 50,565 ఎకరాలు వ్యవసాయ భూములే, అలాగే లక్ష ఇళ్లు ప్రొహిబిటెడ్ లిస్టులోనే ఉన్నాయి అని చెప్పిన వారు ఆ సంఖ్యలకు సంబంధించిన పూర్తి అధికారిక ఆధారాలను ప్రజల ముందుంచాలి.
*మా ప్రశ్న చాలా సూటిగా ఉంది:*
50,565 ఎకరాలు మరియు లక్ష ఇళ్లకు సంబంధించిన పూర్తి Survey-wise List ఎక్కడ ఉంది?.
*ఆ జాబితాను ప్రజల ముందుంచండి.*
మండలాల వారీగా...గ్రామాల వారీగా ...సర్వే నంబర్ల వారీగా ...విస్తీర్ణం వారీగా ...
వర్గీకరణ వారీగా...పూర్తి వివరాలను బహిర్గతం చేయండి.
ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు చట్టవిరుద్ధంగా ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చబడి ఉంటే, వాటిని చట్ట ప్రకారం పరిశీలించి తొలగించాల్సిందే. దానిపై ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ప్రభుత్వ భూములు, చెరువులు/నీటి వనరులకు సంబంధించిన శిఖం భూములు, అసైన్డ్ ల్యాండ్స్ మరియు చట్టపరంగా సెక్షన్ 22-A పరిధిలోకి వచ్చే ఇతర ఆస్తులను కేవలం రాజకీయ ఒత్తిడి కారణంగా తొలగించడం సాధ్యం కాదు.మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రికార్డుల్లో డి నోటిఫికేషన్ / డిలేషన్ ఫ్రమ్ ప్రోహిబిషన్ కు సంబంధించిన ప్రత్యేక జాబితాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే డీ-నోటిఫై లేదా ప్రొహిబిషన్ నుంచి తొలగించిన ఆస్తులను ప్రస్తుత ప్రొహిబిటెడ్ లిస్టు విస్తీర్ణంలో కలిపి చూపడం కూడా సరికాదు.
**ప్రజలకు ఒకే ఒక్క విజ్ఞప్తి:**
రాజకీయ ఆరోపణలు కాదు  పూర్తి రికార్డులు బయటకు రావాలి.సంఖ్యలు కాదు సర్వే వైస్ ఎవిడెన్స్ కావాలి.
*ఎవరి భూమి?*
*ఏ సర్వే నెంబర్ ?*
*ఎంత విస్తీర్ణం?*
*ఏ క్లాసిఫికేషన్ ?*
*ఏ చట్టం కింద ప్రోహిబిటెడ్ ?*
ఇవన్నీ ప్రజలకు తెలియాలి. పూర్తి జాబితాను బహిర్గతం చేయండి.ప్రజలే రికార్డులను పరిశీలించి వాస్తవాలను నిర్ణయించనివ్వండి.
*“రాజకీయాల కంటే వాస్తవాలకే ప్రాధాన్యత ఉండాలి.”*
50,565 ఎకరాలు + లక్ష ఇళ్లకు సంబంధించిన పూర్తి సర్వే వైస్ ప్రోహిబిటెడ్ లిస్ట్ ను ప్రజల ముందుంచండి.

ఈ రోజు, నా కళ్లు కృతజ్ఞతా భావంతో తడిసిపోయాయి_

*ఈరోజు మనం మరో మంచి అధికారిణి, ఐఏఎస్ దివ్య మిట్టల్‌ను కోల్పోయాము.*

*ఆమె రాజీనామా చేశారు.*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 30:

ఉత్తర ప్రదేశ్ కేడర్‌కు చెందిన 2013 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్.ఐఐటీ IIT ఢిల్లీ నుండి బి.టెక్ మరియు ఐఐఎమ్ IIM బెంగళూరు నుండి మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశారు.దివ్య మిట్టల్ ఉత్తరప్రదేశ్‌లో కీలకమైన పరిపాలనా పదవులను నిర్వహించారు. ఇందులో డియోరియా, మీర్జాపూర్ మరియు సంత్ కబీర్ నగర్ జిల్లాల్లో డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ హోదాలు కూడా ఉన్నాయి.ఆమె మొదట లండన్‌లో ఆర్థిక రంగానికి సంబంధించిన ఉద్యోగం చేశారు. విదేశాలలో వృత్తిపరంగా విజయం సాధించినప్పటికీ, దివ్య మిట్టల్ భారతదేశానికి తిరిగి వచ్చి దేశం కోసం ఏదైనా చేయాలని భావించారు.చివరికి ఆమె లండన్‌లోని ఉద్యోగాన్ని వదిలి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత, క్షేత్రస్థాయిలో సేవ చేయడానికి ఆమె UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.యూపీలోని ఒక గ్రామంలో ప్రజలు 75 ఏళ్లుగా ట్యాంకర్ల నీటిపై ఆధారపడి జీవించిన ఉదంతం అందరికీ తెలిసిందే.అక్కడి ప్రజలు,గ్రామస్థులు ఎంపీని, ఎమ్మెల్యేను ఎన్నోసార్లు వేడుకున్నా ఏమీ జరగలేదు.ఆ తర్వాత ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ ఆ గ్రామానికి కుళాయి నీళ్లు తెచ్చారు. కానీ, నీటి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యేను ఆహ్వానించలేదనే కారణంతో ఆమెను బదిలీ చేశారు. ఆ తర్వాత, గ్రామానికి నీటిని సరఫరా చేసే పైప్‌లైన్‌ను కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు.నిజాయితీ గల అధికారులను శిక్షించడానికే మన వ్యవస్థ రూపొందించబడినట్లు అనిపిస్తుంది.భారత ప్రజలకు సేవ చేయడానికి ఆమె తన లండన్ ఉద్యోగాన్ని వదులుకున్నారు. కానీ ఈరోజు రాజీనామా చేశారు.ఆమె రాజీనామాకు కారణం ఎవరు? కానీ ఆమె నిజాయితీ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించింది అని ప్రజలు అనుకుంటున్నారు.
*దివ్య మిట్టల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రజలకు ఇచ్చిన సందేశం* 
ఈ రోజు, నా కళ్లు కృతజ్ఞతా భావంతో తడిసిపోయాయి. ఒక దృశ్యం నా మనసులో చెరగని ముద్ర వేసింది: లహురియా దాహ్ కొండ ప్రాంతానికి చెందిన ఆ వృద్ధ తల్లి, తన గ్రామానికి నీరు మొదటిసారిగా చేరడాన్ని చూసి ఏమీ మాట్లాడలేదు—కేవలం వణుకుతున్న చేతులతో నా తలను తాకి నన్ను ఆశీర్వదించింది. నేను ఈ రోజు నా అధికారిక పదవి నుండి దిగి ఉండవచ్చు, కానీ ఆ స్పర్శ నన్ను ఎప్పటికీ వీడిపోదు; అలాగే, ఈ దేశపు నేల నాకు ప్రసాదించిన ఆ కల కూడా నా నుండి చెరిగిపోదు.
నేను ఎంతో కృషి చేసే అవకాశాన్ని పొందాను మరియు ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. సరైన దాని కోసం నిలబడటం అనేది కేవలం ఒక ఎంపిక మాత్రమే కాదు, అది ఒక బాధ్యత అని డియోరియా నాకు నేర్పింది. 'అసాధ్యం' అనేది ఒక వాస్తవం కాదని, అది కేవలం ఒక అభిప్రాయం మాత్రమేనని మీర్జాపూర్ నాకు బోధించింది. ఇక వింధ్యవాసిని అమ్మవారి సన్నిధిలో కూర్చున్నప్పుడు, నిజమైన శక్తి అనేది అధికార పదవి నుండి కాకుండా, అమ్మవారి అనుగ్రహం మరియు ప్రజల విశ్వాసం నుండే లభిస్తుందని నేను తెలుసుకున్నాను. అన్నిటికంటే గొప్ప పాఠం ఏమిటంటే—నా కోసం నేను కన్న కలలు అప్పటికే సాకారమయ్యాయి; ఇక ఇప్పుడు, నా ప్రజల కోసం నేను కన్న కలలను నిజం చేసుకుంటూ జీవించాల్సిన సమయం ఆసన్నమైంది. తమ భూమిపై హక్కులను మొట్టమొదటిసారిగా పొందిన కుటుంబాల కళ్ళలో ఈ జీవితానికి సంబంధించిన నిజమైన తృప్తిని నేను చూశాను.గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే అవకాశం పొందిన దివ్యాంగుడితోనూ, తన పొలాలకు నీటి సౌకర్యం సమకూరిన రైతుతోనూ కలిసి నడుస్తున్నప్పుడు నేను ఒక విషయాన్ని గ్రహించాను: ప్రతి ప్రభుత్వ ఫైలు వెనుక ఒక మనిషి ఉంటాడు—వారి గౌరవాన్ని కాపాడటమే నిజమైన న్యాయం.
నేను ఏదో ఇవ్వడానికి వచ్చానని అనుకోవడం నా అవివేకం. నిజానికి, అత్యధికంగా పొందింది నేనే; ఆ రుణభారం అంతకంతకూ పెరుగుతూనే వచ్చింది. నా సంతోషాన్ని చూసి నాకంటే ఎక్కువగా ఇతరులే ఆనందించారు. నేను అలసిపోయినట్లు లేదా కృంగిపోయినట్లు అనిపించినప్పుడు కూడా, వారు నాపై అచంచలమైన నమ్మకాన్ని ఉంచారు. ఆ నమ్మకమే నాకు ముందుకు సాగే ధైర్యాన్ని ఇచ్చింది. నాకు లభించిన అపారమైన ప్రేమ, గౌరవం మరియు 'ఇది నా కుటుంబం' అనే భావన నా హృదయాన్ని పూర్తిగా నింపేశాయి. నాతో అడుగడుగునా అండగా నిలిచి, స్థిరంగా సహకరించిన నా సహచరులు, అధికారులు మరియు సిబ్బందికి దీనికి సంబంధించిన గొప్ప గుర్తింపు దక్కుతుంది.

Sunday, August 30, 2026

తెలంగాణ లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా పూర్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి_

*తెలంగాణ లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా పూర్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 29:

తెలంగాణలో 2026 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కారణంగా అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు తొలగిపోకూడదని, అలాగే అనర్హులైన ఓటరు ఎవరూ జాబితాలో చేరకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా భారత ఎన్నికల సంఘం ECI ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేష్ కుమార్ గారికి ముఖ్యమంత్రి  లేఖ రాశారు. అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించే గడువును పొడిగించడంతో పాటు ఓటర్లకు తగిన సమయం, అవసరమైన సహాయం అందించేలా విధానపరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు.2026 జూన్ 10 నాటికి రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో 73.39 లక్షల మందిని 21.7 శాతం,గైర్హాజరైన, నివాసం మారిన, మరణించిన, ఒకటికి మించి నమోదైన ఓటర్లుగా అసడ్ గుర్తించినట్లు ముఖ్యమంత్రి  ECISVEEP గణాంకాలను ఉటంకించారు. ఈ వర్గంలో దాదాపు 62 శాతం మంది అంటే 45.19 లక్షల మందిని శాశ్వతంగా నివాసం మారిన వారిగా గుర్తించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. మరోవైపు డిజిటలైజ్ చేసిన 2.65 కోట్ల గణన పత్రాల్లో 60.50 లక్షల పత్రాల్లో లోపాలు ఉండగా, 32.36 లక్షల పత్రాలకు గత ఓటర్ల జాబితాతో అనుసంధానం చేయబడలేదని తెలిపారు. దీంతో సుమారు 92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది రాష్ట్రంలోని దాదాపు మూడో వంతు ఓటర్లను ప్రభావితం చేసే అంశమని ఎన్నికల సంఘానికి వివరించారు.ప్రస్తుత సవరణ విధానంలో కొన్ని కీలకమైన లోపాలు ఉన్నాయని ముఖ్యమంత్రి గారు లేఖలో పేర్కొన్నారు. గణన సిబ్బంది పరిశీలనకు వచ్చిన సమయంలో తాత్కాలికంగా ఇళ్లలో లేని వారిని, శాశ్వతంగా నివాసం మారిన వారిని ఒకే విధంగా పరిగణిస్తున్నారని తెలిపారు.నిజంగా నివాసం మారిన వారికి కొత్త ప్రాంతంలో ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం-6 ద్వారా ఎలాంటి సహాయం అందించకుండానే పాత నివాసంలోని ఓటు తొలగిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా నివాసం మారిన వారి పేర్లను తొలగించే ముందు అధికారిక నోటీసు ప్రక్రియను పాటించడం లేదని తెలిపారు.దీనివల్ల ఓటర్లు పోలింగ్ రోజున కేంద్రానికి వెళ్లే వరకు తమ ఓటు హక్కు తొలగిపోయిన విషయం తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు.హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే రాష్ట్రంలోని మొత్తం గైర్హాజరు, నివాసం మారిన, మరణించిన, ఒకటికి మించి నమోదైన ఓటర్లలో 58.6 శాతం, పరిశీలన నోటీసుల్లో 41.9 శాతం కేంద్రీకృతమై ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.ఉద్యోగాలు, వివాహాలు, తాత్కాలిక నివాస మార్పుల కారణంగా పట్టణ ప్రాంతాల్లో అనేక మంది ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున సవరణ ప్రక్రియను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు.సమీప భవిష్యత్తులో తెలంగాణ లో ఎలాంటి ఎన్నికలు లేవని, అందువల్ల ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సమగ్రంగా నిర్వహించేందుకు తగిన సమయం ఉందని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉన్న అభ్యంతరాలు, ఫిర్యాదుల గడువును మరో నాలుగు వారాలు పొడిగించి, నిర్ణయించిన తుది ఓటర్ల జాబితా ప్రచురణ తేదీ అక్టోబర్ 19 నుంచి సవరించాలని కోరారు.గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ముందుగానే విస్తృత ప్రచారం నిర్వహించి, కనీసం రెండుసార్లు గ్రామసభలు, వార్డు కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి ముసాయిదా ఓటర్ల జాబితాలను బహిరంగంగా చదివి వినిపించాలని విజ్ఞప్తి చేశారు.నోటీసులు అందుకున్న రోజువారీ కూలీలు, వలస కార్మికులు, వయోవృద్ధులు తమ పత్రాలను సమర్పించేందుకు వారం రోజుల సమయం సరిపోదని, కనీసం మూడు నుంచి నాలుగు వారాల సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. 
ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నియోజకవర్గ, పోలింగ్ కేంద్ర స్థాయిలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఓటర్లకు అవసరమైన పత్రాలపై అవగాహన కల్పించడంతో పాటు వాటిని పొందేందుకు సహకరించాలని సూచించారు.ప్రభుత్వ ఉత్తర్వు  జీవో నంబర్ 172 ప్రకారం జారీ చేసే కుటుంబ నమోదు ధ్రువపత్రాన్ని అంగీకరించకపోవడం వల్ల పట్టణ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ముఖ్యమంత్రి గారు తెలిపారు. మండల స్థాయిలో సులభంగా లభించే ఇతర పత్రాలను కూడా అంగీకరించేలా ఆధారాల జాబితాను సవరించి విస్తరించాలని సూచించారు.హైదరాబాద్ లోని ప్రతి నియోజకవర్గంలో సగటున 78 వేలకుపైగా కేసులు ఉన్నందున కేవలం కొంతమంది  అధికారుల నియామకం సరిపోదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఓటర్ల నమోదు అధికారి స్థాయికి దిగువన అదనపు అధికారులను నియమించి, ముద్రిత నోటీసుల్లోనే నిర్దిష్ట తేదీలు, సమయాలను పేర్కొంటూ వికేంద్రీకృత విచారణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అర్హత ఉన్న ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు కోరారు.ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ కేంద్రాల ఏర్పాటు, గ్రామసభల నిర్వహణతో పాటు పరిపాలనా, ఇతర అవసరమైన సహకారాన్ని పూర్తిస్థాయిలో అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ లేఖలో స్పష్టం చేశారు.

ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు సామాజిక బాధ్యతపై అవగాహన అవసరం: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్_

*ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు సామాజిక బాధ్యతపై అవగాహన అవసరం: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 29:

రోహిణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ఎమ్డిసి హైదరాబాద్ మారతాన్ (NMDC Hyderabad Marathon – 2026)లో భాగంగా 5కే రన్ విజయవంతంగా, ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఎచ్ఐసీసీ HICC నుంచి హైటెక్స వరకు నిర్వహించిన ఈ పరుగు కార్యక్రమంలో సుమారు 6,100 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు.ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ పరుగు కార్యక్రమాన్ని “Run for a Cause” అనే సందేశంతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నప్పటికీ, నిర్వాహకులు మరియు పోలీసు సిబ్బంది సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కార్యక్రమం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, ఐపీఎస్‌, సీఎంసీ కమిషనర్ శ్రీమతి సృజన, విద్యార్థులు, రన్నర్లు మరియు సామాన్య ప్రజలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, ఐపీఎస్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ శారీరక దృఢత్వంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. క్రమం తప్పకుండా పరుగు, నడక వంటి శారీరక వ్యాయామాలు చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. అదే విధంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా సమాజంలో సేవాభావాన్ని మరింత పెంపొందించవచ్చని పేర్కొన్నారు.పిల్లలు సెల్‌ఫోన్‌లకు ఎక్కువ సమయం కేటాయించకుండా పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకునేలా *“సెల్‌ఫోన్ వద్దు – పుస్తకమే ముద్దు”* అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. కథల పుస్తకాలు, ఇతర పుస్తకాలు, రాత సామగ్రిని అవసరమైన వారికి అందించడం ద్వారా పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు వారి జ్ఞానాన్ని విస్తరించేందుకు దోహదపడుతుందని అన్నారు.రోహిణి ఫౌండేషన్ చేపట్టిన “పవర్ అఫ్ 100” కార్యక్రమం ద్వారా సమాజంలోని ప్రతి ఒక్కరి చిన్న సహకారం కూడా ఒక పెద్ద సానుకూల మార్పుకు దోహదపడుతుందనే సందేశాన్ని అందించారు. *“100 People – ₹100 Each – One Powerful Change”* అనే భావనతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా సామాజిక బాధ్యత, సమిష్టి భాగస్వామ్యం మరియు సేవాభావాన్ని ప్రజల్లో పెంపొందించేందుకు కృషి చేశారు.సుమారు 6,100 మంది పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన రోహిణి ఫౌండేషన్ నిర్వాహకులు, NMDC Hyderabad Marathon నిర్వాహకులు, రన్నర్లు, విద్యార్థులు, ప్రజలు మరియు సైబరాబాద్ పోలీస్ సిబ్బందికి సైబరాబాద్ పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.

Saturday, August 29, 2026

వేతన చెల్లింపులో జాప్యం, ఫారమ్-16 జారీపై చర్యలు తీసుకోవాలని TGHRC సిఫార్సు_

*ప్రెస్ రిలీజ్*

*వేతన చెల్లింపులో జాప్యం, ఫారమ్-16 జారీపై చర్యలు తీసుకోవాలని TGHRC సిఫార్సు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 28:

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC), గౌరవ చైర్‌పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన, HRC No.4763 of 2021లో 28.07.2026 తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ విరమణ చేసిన ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు వేతనం దీర్ఘకాలం చెల్లించకపోవడం, తద్వారా ఆదాయపు పన్ను సంబంధిత ఇబ్బందులు ఎదురైన అంశంపై కమిషన్ విచారణ జరిపింది.
ఫిర్యాదుదారు 23.10.2015 నుండి 24.02.2017 వరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC)లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేశారు. సంబంధిత కాలానికి సంబంధించిన రూ.14,24,488/- వేతనం అక్టోబర్, 2018లో ఆయన మునుపటి పోస్టింగ్ స్థలం నుండి లాస్ట్ పే సర్టిఫికేట్ (LPC) అందిన అనంతరం ఒకేసారి చెల్లించబడింది. అలాగే, Form-16, బిల్లు వారీ వివరాలు, TDS చెల్లింపుల వివరాలు సకాలంలో అందకపోవడంతో ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసులు అందినట్లు ఫిర్యాదుదారు తెలిపారు.
సంబంధిత అధికారుల నివేదికలను పరిశీలించిన కమిషన్, వేతనం చెల్లించడంలో ఒక సంవత్సరానికి పైగా జాప్యం జరిగినట్లు పేర్కొంది. ఉద్యోగి బదిలీ అయినప్పుడు సర్వీస్ రిజిస్టర్ , ఎల్పిసి LPC తదితర సేవా రికార్డులను సకాలంలో బదిలీ చేసి, వేతన చెల్లింపులో అంతరాయం లేకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత పరిపాలనా అధికారులపై ఉందని కమిషన్ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో, సంబంధిత ఇంజనీర్-ఇన్-చీఫ్, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ మరియు కమిషనర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వైపు జాప్యం ఉన్నట్లు కమిషన్ అభిప్రాయపడింది.
మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993లోని సెక్షన్ 18 కింద తన అధికారాలను వినియోగిస్తూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రధాన కార్యదర్శి ఫిర్యాదుదారుడి వేతన చెల్లింపులో జరిగిన జాప్యం మరియు అక్టోబర్, 2015 నుండి ఫిబ్రవరి, 2017 వరకు కాలానికి Form-16 జారీ అంశాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫార్సు చేసింది.
*పై సిఫార్సుతో కేసులో తదుపరి చర్యలను కమిషన్ ముగించింది.*

పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ట‌వ‌ర్స్_

*పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ట‌వ‌ర్స్*

*క్యూర్‌ పరిధిలో అత్యంత పారదర్శకంగా ఇందిరమ్మ టవర్స్‌ లక్కీడ్రా*

*రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 28:

హైదరాబాద్ మహానగరంలో  నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే  ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి  పారదర్శకంగా  ల‌బ్దిదారుల ఎంపిక చేపడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.  అర్హతే ప్రామాణికంగా, కులమతాలు , రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని స్పష్టం చేశారు.
క్యూర్  ప్రాంతంలో తొలి విడతగా చేపడుతున్న ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపునకు అత్యంత పారదర్శకంగా లక్కీడ్రా నిర్వహిస్తున్నామని తెలిపారు. మీడియా, అర్హులైన లబ్ధిదారుల సమక్షంలో లక్కీడ్రా నిర్వహిస్తూ, మొత్తం ప్రక్రియను అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని చెప్పారు.
**శుక్రవారం నాంపల్లి, కుత్బుల్లాపూర్‌, సికింద్రాబాద్‌, రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల కోసం లక్కీడ్రా నిర్వహించారు.**
 నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్‌హిల్స్‌లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల కేటాయింపునకు వెట్‌ గార్డెన్స్‌లో, రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని మైలార్‌దేవుపల్లి పరిధికి సంబంధించి లక్ష్మీగూడలో నిర్వహించిన లక్కీడ్రా కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని డ్రా తీశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈరోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 8 వేల ఫ్లాట్లకు లక్కీడ్రా నిర్వహిస్తున్నామని తెలిపారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున లక్కీడ్రా ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు.
ప్రతి నియోజకవర్గంలో 480 ఫ్లాట్లకు 600 మంది లబ్ధిదారులను లక్కీడ్రా ద్వారా ఎంపిక చేస్తామని మంత్రి వివరించారు. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో తుది పరిశీలన నిర్వహిస్తారని, ఎంపికైన వారిలో ఎవరైనా అనర్హులుగా తేలితే మిగిలిన 120 మందిలోని అర్హులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ విధానం ద్వారా అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు.
గౌర‌వ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 13న కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన చేశారని మంత్రి గుర్తు చేశారు. అనంతరం రికార్డు సమయంలోనే 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి టెండర్లు పిలవడం, మరోవైపు లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీడ్రా నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వానికి గొప్ప విజయమని అన్నారు.క్యూర్‌ పరిధిలో తొలి విడతగా లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, ఆయా నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం సెప్టెంబర్‌ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి వెల్లడించారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ఇప్పటికే 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు.
ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని నాలుగు విడతల్లో అందిస్తోందని, చివరి విడత బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయని వివరించారు.రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేసి, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. మరో పది రోజుల్లో రెండో విడత లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయ్యే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.ప్రభుత్వానికి డబ్బు కూడబెట్టుకోవడం కంటే పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా సొంత ఇంటిని అందించడం ముఖ్యమని అన్నారు. ఎకరం రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.300 కోట్లు విలువ చేసే ప్రాంతాల్లోనూ పేద కుటుంబాలు గౌరవంగా జీవించాలి  అని మంత్రి స్పష్టం చేశారు.ఇందిరమ్మ టవర్స్‌లో ఇల్లు పొందిన అర్హులైన లబ్ధిదారులకు ఒక్క పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని మంత్రి తెలిపారు. రిజిస్ట్రేషన్‌ అనంతరం పదేళ్ల తర్వాత అవసరాన్ని బట్టి ఇంటిని విక్రయించుకునే సదుపాయం ఉంటుందని చెప్పారు. అంతకుముందే ఏదైనా అత్యవసర అవసరం ఏర్పడితే, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ను బ్యాంకులో కుదువ పెట్టుకుని రుణం పొందే అవకాశం కూడా ఉంటుందని వివరించారు.లక్కీడ్రాలో ఇల్లు పొందిన ప్రతి లబ్ధిదారుడికి సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించి అందిస్తామని మంత్రి చెప్పారు. ఒక్కో ఇంటికి 17 నుంచి 20 గజాల అన్‌డివైడెడ్‌ షేర్‌ భూమి కూడా ఉంటుందని తెలిపారు.ప్రభుత్వం గుర్తించిన స్థలాల్లో అవసరాన్ని బట్టి 10 అంతస్తుల వరకు ఇందిరమ్మ టవర్స్‌ నిర్మిస్తామని, లిఫ్ట్‌లతో పాటు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు.
లక్కీడ్రా పూర్తయిన తర్వాత లబ్ధిదారుల తుది ఎంపిక జరుగుతుందని, అధికారుల పరిశీలన అనంతరం సర్టిఫికెట్లు అందజేస్తారని మంత్రి తెలిపారు. ఆ తర్వాత కేవలం 3–4 రోజుల్లోనే టవర్స్‌ నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించుకునే అవకాశం కూడా ఉంటుందని మంత్రి తెలిపారు.నాంపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన లక్కీడ్రాలో తొలుత ఎస్సీ విభాగానికి కేటాయించిన 14 శాతం రిజర్వేషన్‌ ప్రకారం 67 ఫ్లాట్ల కోసం 288 మంది పేర్లతో కూడిన చీటీలను డ్రమ్ములో వేశారు.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మాజిద్‌ హుస్సేన్‌, హౌసింగ్‌ ఎండీ వి.పి. గౌతమ్‌, కలెక్టర్‌ ప్రియాంక తదితర అధికారుల సమక్షంలో లబ్ధిదారులతోనే డ్రా తీయించారు.ఎస్సీ విభాగంలో తొలి ఫ్లాట్‌కు మరకాల కృష్ణవేణి ఎంపిక కాగా, అనంతరం టి.అనిత, మంగనూరి అనసూయ, ఎం.కుమారి, శైలజాకుమారి వరుసగా ఫ్లాట్లను లక్కీడ్రా ద్వారా పొందారు.
ప్రతి నియోజకవర్గంలో సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 

**ఎస్సీలకు – 14 శాతం, ఎస్టీలకు – 5 శాతం, బీసీలకు – 16 శాతం, దివ్యాంగులకు – 5 శాతం పారిశుధ్య కార్మికులు, నాలుగో తరగతి ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు – 10 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు వివరించారు*. 
ఈ ఫ్లాట్లలో మొత్తం 50 శాతం రిజర్వేషన్లు ఉండగా, మొత్తంగా మహిళలకు 30 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి  వెల్లడించారు.

జపాన్‌ సంస్థతో ‘యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ’ భాగస్వామ్యం_

*జపాన్‌ సంస్థతో ‘యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ’ భాగస్వామ్యం*

*హిరోషిమా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీతో సూత్రప్రాయ అంగీకారం*

*హైదరాబాద్‌కు రావాలని హెచ్‌ఐటీ ప్రతినిధులకు మంత్రి వివేక్‌ వెంకటస్వామి ఆహ్వానం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 28:

తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విద్య, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలను అందించేందుకు జపాన్‌లోని ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థలతో భాగస్వామ్యాలను బలోపేతం చేస్తున్నామని శక్తి మరియు గనులు శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. ఇందులో భాగంగా హిరోషిమా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (హెచ్‌ఐటీ), యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ (వైఐఎస్‌యూ) మధ్య భాగస్వామ్యానికి సూత్రప్రాయ అంగీకారం కుదిరిందని పేర్కొన్నారు.జపాన్‌ పర్యటనలో భాగంగా మంత్రి వివేక్‌ వెంకటస్వామి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం శుక్రవారం హిరోషిమా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీని సందర్శించింది. ఈ సందర్భంగా సంస్థ నాయకత్వంతో తెలంగాణలో సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల తయారీపై విస్తృతంగా చర్చించింది.తొలిదశలో పరస్పర అవగాహనతో భాగస్వామ్యాన్ని ప్రారంభించి.. తెలంగాణకు అవసరమైన నైపుణ్యాలు, సాంకేతికత, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సహకార రంగాలను సంయుక్తంగా గుర్తించాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి.
హెచ్‌ఐటీ–వైఐఎస్‌యూ భాగస్వామ్యంలో విద్యార్థుల పరస్పర మార్పిడి కార్యక్రమాన్ని కీలకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా తెలంగాణ విద్యార్థులకు జపాన్‌లోని సాంకేతిక విద్యా విధానం, ప్రయోగశాల ఆధారిత శిక్షణ, పరిశ్రమలతో అనుసంధానమైన విద్యా విధానంపై ప్రత్యక్ష అవగాహన కల్పించనున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆచరణాత్మకంగా నేర్చుకునే అవకాశాలు కూడా కల్పించనున్నారు.అధ్యాపకులు, శిక్షకుల నైపుణ్యాభివృద్ధి, ట్రైనింగ్‌ ఆఫ్‌ ట్రైనర్స్‌ (టీఓటీ), స్వల్పకాలిక సాంకేతిక కోర్సులు, పరిశోధన, పరిశ్రమలతో ప్రత్యక్ష అనుభవం వంటి అంశాల్లోనూ సహకారాన్ని పరిశీలించాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. తెలంగాణలో స్థానిక అవసరాలు, భవిష్యత్‌ ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్య రంగాలను ఎంపిక చేయనున్నారు. అధునాతన తయారీ, మొబిలిటీ, ఆటోమొబైల్‌ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమేషన్‌, డిజిటల్‌ టెక్నాలజీలు, పర్యావరణ సాంకేతికత వంటి రంగాల్లో ప్రత్యేకంగా సహకారం పెంచుకోవడంపై చర్చించారు. హిరోషిమా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇంజినీరింగ్‌ రంగంలోని సామర్థ్యాలు.. తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక, సాంకేతిక రంగాలకు అనుకూలంగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.కేవలం సంప్రదాయ విద్యా మార్పిడికి పరిమితం కాకుండా.. నైపుణ్యాలు, ఉపాధి సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, పరిశ్రమల అవసరాలకు నేరుగా ఉపయోగపడే కార్యక్రమాలను రూపొందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. జపాన్‌ సాంకేతికత, తయారీ రంగం, పరిశ్రమల ఆధారిత విద్యా విధానంలోని ఉత్తమ పద్ధతులను తెలంగాణ అవసరాలకు అనుగుణంగా అమలు చేయాలని అన్నారు.
తరగతి గది, ప్రయోగశాల విద్యను వాస్తవ పరిశ్రమల సవాళ్లు, పరిశోధనతో అనుసంధానించే హెచ్‌ఐటీ విధానంపై తెలంగాణ ప్రతినిధి బృందం ప్రత్యేక ఆసక్తి చూపింది. ఇలాంటి విధానాలను యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీతో పాటు తెలంగాణ సాంకేతిక విద్యా వ్యవస్థలో ఎలా అమలు చేయవచ్చనే అంశంపై చర్చించారు.
**హైదరాబాద్‌కు రావాలని ఆహ్వానం**
హెచ్‌ఐటీ ప్రతినిధులను హైదరాబాద్‌కు వచ్చి యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని సందర్శించాలని మంత్రి వివేక్‌ వెంకటస్వామి ఆహ్వానించారు. తదుపరి చర్చల ద్వారా భాగస్వామ్యానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
డిసెంబరులో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌–2026’లో పాల్గొని.. తెలంగాణతో మరిన్ని సంస్థాగత, పారిశ్రామిక భాగస్వామ్యాలను పరిశీలించాలని హెచ్‌ఐటీ ప్రతినిధులను మంత్రి ఆహ్వానించారు.జపాన్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలు, పరిశ్రమలతో నేరుగా సంస్థాగత సంబంధాలను ఏర్పరచుకోవడంలో ఈ భాగస్వామ్యం మరో కీలక ముందడుగని మంత్రి తెలిపారు. ప్రపంచస్థాయి సాంకేతిక విద్య, నైపుణ్యాలు, పరిశ్రమల అనుభవాన్ని తెలంగాణ యువతకు అందించేందుకు ఇటువంటి భాగస్వామ్యాలను మరింత విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు.