Saturday, September 5, 2026

మీ చేతిలోనే కలం ఉంది మీ చేతిలోనే బలం ఉంది - సీఎం రేవంత్ రెడ్డి

*కొడంగల్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*

*"మీ చేతిలోనే కలం ఉంది. మీ చేతిలోనే బలం ఉంది” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 05:

రెండు సంవత్సరాలపాటు సహకరించి వెసులుబాటు కల్పిస్తే పీఆర్సీ, ఇంక్రిమెంట్ల వంటి ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిరుపేదల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి విద్యా రంగంలో సంస్కరణలు చేపట్టిన ఈ దశలో తెలంగాణ విద్యా వ్యవస్థను భారతదేశానికి ఒక దిక్సూచిలా నిలబెట్టడానికి ఉపాధ్యాయులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
కొడంగల్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ,మంత్రి దామోదర్ సిల్లరపు, ప్రభుత్వ సలహదారు కే కేశవరావు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.భారతదేశ మాజీ రాష్ట్రపతి, ఆదర్శ ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి ముఖ్యమంత్రి  పుష్పాంజలి ఘటించి ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “ఆర్థిక వెసులుబాటును బట్టి ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. మిగతా శాఖలతో పోల్చితే విద్యా శాఖ ఆదర్శంగా నిలబడాలి. పిల్లల భవిష్యత్తుకు మార్గదర్శకులు మీరే. రెండేండ్లు సమయం ఇవ్వండి. రాష్ట్రంలోని ప్రతి ఉపాధ్యాయుడికి విజ్ఞప్తి చేస్తున్నా. రెండేండ్లలో సమస్యలన్నింటినీ సామరస్యంగా మీరు అడక్కుండానే పరిష్కరించే బాధ్యత నాది” అని స్పష్టం చేశారు.“తెలంగాణ విద్యా వ్యవస్థను భారతదేశానికి ఒక రోల్ మాడల్‌గా నిలబెడుదాం. అందుకు కథానాయకులు ఉపాధ్యాయులే. అందుకు ఉపాధ్యాయులంతా పునరంకితం కావాలి. ఇంట్లో సొంత పిల్లలను ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారో మీ వద్ద చదువుకుంటున్న విద్యార్థుల విషయంలోనూ అంతే శ్రద్ధ పెట్టాలి. ఉపాధ్యాయులపై నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది.
ప్రభుత్వ సర్వీసులో మీరు 30 ఏళ్లకు పైగా సేవలందిస్తారు. రాజకీయ నాయకులం ప్రతి ఐదేళ్లకు ఒకసారి మీముందుకొచ్చి పరీక్షలు రాయాల్సిందే. నేను చెప్పిన ప్రకారం చేయకుండా ఉంటే.. నిర్ణయం తీసుకోవలసింది మీరే. అందుకు మార్కులు వేయాల్సిందీ మీరే. మీ చేతిలోనే కలం ఉంది. మీ చేతిలోనే బలం ఉంది” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. “ఉపాధ్యాయులే వీధుల్లోకి వస్తే ప్రభుత్వానికి, రాష్ట్రానికి శుభ సూచకం కాదు. మిగతా శాఖలు వేరు. పిల్లల భవిష్యత్తుకు నిర్దేశకులు మీరు. మీరే ధర్నాలు చేస్తానంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నా. రెండేళ్లు సమయం ఇవ్వండి.ఉపాధ్యాయులు, లెక్చరర్లకు అణాపైసా కష్టం రానివ్వను. పీఆర్సీ, ఇంక్రిమెంట్‌లతో పాటు మిగతా సమస్యలు వేటిలోనూ చిన్న కష్టం రానివ్వను. సలహాదారు కేశవరావుతో కూర్చొని మాట్లాడండి. నన్ను విశ్వసించి సహకరించండి” అని విజ్ఞప్తి చేశారు.“గత ప్రభుత్వంలో పదేండ్ల పాటు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. విధ్వంసం చేశారు. విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించే శక్తి ఉపాధ్యాయులపైనే ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో 80 వేల అడ్మిషన్లు పెరిగాయంటే ఆ గొప్పతనం ఉపాధ్యాయులదే.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులకు సంబంధించి ఎలాంటి వివాదం లేకుండా బదిలీల ప్రక్రియ పూర్తి చేశాం. జీవో 317 కింద తలెత్తిన సమస్యలను పరిష్కరించాం. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు కల్పించాం. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే కాదు ఉత్తమ విధానాలను అధ్యయనం చేయడానికి ఉపాధ్యాయులను విదేశాలకు పంపించాం.దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా కమిషన్ నియమించి ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. ఉపాధ్యాయుల ఆలోచనలను పరిగణలోకి తీసుకుని సాంకేతిక నైపుణ్యంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. 
ప్రభుత్వ విధానంలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలి. మనమంతా లక్షలాది విద్యార్థినీ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఉన్నాం. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. సహకరించండి. నిస్సందేహంగా ఈ ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరిస్తుంది” స్పష్టంగా చెప్పారు.“జాతీయ విద్యా విధానంతో విద్యా రంగంలో ఎన్నో మార్పులొస్తున్నాయి. మనం కూడా విధానాలు మార్చుకోవాలి. నిరుపేద పిల్లలు తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆశిస్తున్నారు. కాలం తీరిపోయిన విద్యా విధానంతోనే వెళదామా. అప్ డేటెడ్ విద్యా విధానాన్ని అందిపుచ్చుకుందామా?
పాలిటెక్నిక్ కాలేజీలు టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ నాలెడ్జ్ సెంటర్లుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పాలిటెక్నిక్ విద్యను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తేస్తే, ప్రైవేటీకరణ చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేశారు. ఐటీఐలను ఏటీసీలుగా మార్చడం వల్ల ఈరోజు ఫలితాలను చూస్తున్నాం.
పాలిటెక్నిక్‌లో రెండేళ్లు థియరీ, మూడో సంవత్సరం కార్పొరేట్ సంస్థల్లో ఇంటర్న్‌గా పనిచేసే విధానం తీసుకొస్తున్నాం. ఇంటర్న్‌గా ఉన్నప్పుడు కార్పొరేట్ కంపెనీలు రూ. 9 వేల వరకు స్టయిఫండ్ కూడా ఇస్తాయి.పాలిటెక్నిక్ ఇప్పటివరకు డిప్లమాలే జారీ చేస్తున్నాయి. విదేశాల్లో మాస్టర్స్ చదువుకోవడానికి వీలుగా డిగ్రీ పట్టాను అందించే విధంగా మార్పులు చేశాం. పాలిటెక్నిక్ పూర్తి చేస్తే ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో చేరడానికి అవకాశం కోల్పోతామన్న తప్పుడు ప్రచారంపై విద్యార్థులు మోసపోవద్దు. నిస్సందేహంగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో చేరడానికి వీలుంది. అందులో ఎలాంటి మార్పు ఉండదు.అలాగే లెక్చరర్లకు సర్వీసు నిబంధనల విషయంలోనూ ఎలాంటి ధోకా ఉండదు. సర్వీస్ రూల్స్ వేరు, విద్య విధానం వేరు. ఈ విషయంలో ఇంకా అనుమానాలు ఉంటే సలహాదారు కేశవరావు గారితో కూర్చొని మాట్లాడండి. ప్రభుత్వం తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. జీతభత్యాలు, పీఆర్సీ, ఇంక్రిమెంట్లు నష్టం కలగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిది” అని విస్పష్టం చేశారు.“మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానంలో స్కిల్స్ నేర్పించడానికి ప్రాధాన్యతనిస్తున్నాం. ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించి ఏటీసీలు మార్చాం. కార్పొరేట్ కంపెనీల సమన్వయంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధానాలను ప్రారంభించాం.నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్య (నాలెడ్జ్ అండ్ కమ్యునికేషన్) ను అందించి 12వ తరగతి తర్వాత నైపుణ్యంలో శిక్షణ ఇప్పించాలి. సాంకేతిక నైపుణ్యం ఉంటే ప్రపంచంలో రాణించగలరు. ఇంజనీరింగ్ పట్టా ఉన్న వారికన్నా నైపుణ్యం ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి” అని వివరించారు.“ప్రపంచ వ్యాప్తంగా ఫోకస్ మారింది. స్కిల్స్ ఉన్నవారికి జర్మనీ, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. స్కిల్స్ తర్వాత ఇన్నొవేషన్ అండ్ ఎంప్లాయిమెంట్ వైపు దృష్టి సారించాలి. యూనికార్న్‌గా నిలబడాలి. ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఈనాడు ఎలాన్ మస్క్ కంపెనీతో పోటీ పడుతోంది. ఇన్నొవేషన్‌పై ఫోకస్ పెట్టాలి.
ఇలాంటి వాటిల్లో ప్రభుత్వం అండగా ఉంటుంది. వాటన్నింటికీ వారధి, సారథులు ఉపాధ్యాయులే. రెండేళ్లు ఫోకస్డ్‌గా పనిచేయండి. ప్రభుత్వ ఆలోచనను అర్థం చేసుకోండి. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిద్దాం” అని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు.“పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు. విద్యా రంగంలో జాతీయ సగటులో 28 స్థానంలో ఉన్న తెలంగాణ 17వ స్థానానికి ఎదగడం ఉపాధ్యాయుల వల్లే సాధ్యమైంది. గడిచిన రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 80 వేలకు పైగా విద్యార్థులు అధికంగా అడ్మిషన్లు తీసుకున్నారంటే ఆ విజయానికి టీచర్లే కారణం.
30-35 ఏళ్లు కష్టపడి ప్రజలకు సేవలు అందించి రిటైరైన తర్వాత బెనిఫిట్స్ ఇవ్వకపోగా పదవీ విరమణ వయస్సును 58 నుంచి 61 చేయడం వల్ల 2025 నుంచి రిటైర్మెంట్లు మొదలయ్యాయి. గత ప్రభుత్వం దాదాపు 8 వేల కోట్ల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా పెండింగ్‌లో పెడితే, ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ నిధులను కూడదీసి వంద రోజుల్లో రూ. 6 వేల కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం చెల్లించాం” అని గుర్తుచేశారు.

"ఇరవై ఒకటవ శతాబ్దంలో విశ్వవిద్యాలయాలు: పునరుద్ధరణ, సంస్కరణలు మరియు మార్గసూచికలు"_

*తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి TGCHE ప్రచురించిన తెలంగాణ జర్నల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ TJHE, సంపుటి 2, సంచిక 1ను గవర్నర్ విడుదల చేశారు.*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 05:

విశ్వవిద్యాలయాలు విద్యా నైపుణ్యం, పరిశోధన మరియు ఆవిష్కరణలను బలోపేతం చేస్తూనే, అభివృద్ధి చెందుతున్న ప్రపంచ పోకడలు, సాంకేతిక పురోగతులు మరియు మారుతున్న నైపుణ్య అవసరాలకు అనుగుణంగా నిరంతరం సంస్కరించుకోవాలని, తమను తాము మలచుకోవాలని తెలంగాణ గౌరవ గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా అన్నారు.
"ఇరవై ఒకటవ శతాబ్దంలో విశ్వవిద్యాలయాలు: పునరుద్ధరణ, సంస్కరణలు మరియు మార్గసూచికలు" అనే ఇతివృత్తంతో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి టీజీసీహెచ్ఈ (TGCHE) ప్రచురించిన తెలంగాణ జర్నల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TJHE), సంపుటి 2, సంచిక 1ను గవర్నర్ విడుదల చేశారు.భారతదేశ జనాభా లాభాన్ని (డెమోగ్రాఫిక్ డివిడెండ్) ప్రముఖంగా ప్రస్తావిస్తూ, పరిశోధన, ఆవిష్కరణలు మరియు జ్ఞాన సృష్టికి విశ్వవిద్యాలయాలు మరిన్ని అవకాశాలను కల్పించాలని, వేగంగా మారుతున్న ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాలతో యువతను సన్నద్ధం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.తెలంగాణలో పరిశోధనా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తూ, విద్యా నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తున్నందుకు టీజీసీహెచ్ఈ ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిస్తారెడ్డి మరియు ఆయన బృందాన్ని గవర్నర్ అభినందించారు.

అన్ని శక్తులను కలుపుకుని పోరాడుతా: ఎంపల్ల పురుషోత్తం రెడ్డి_

*ప్రెస్ నోట్* 

*నీళ్లు.. నిధులు.. నియామకాలు.. సమాన హక్కుల సాధనే లక్ష్యం: ఎంపల్ల పురుషోత్తం రెడ్డి*
*నూతన ప్రజాస్వామిక తెలంగాణ కోసం ప్రజాస్వామిక శక్తులన్నీ ఏకం కావాలి*

బాపట్ల కృష్ణమోహన్,మీడియా టుడే,సెప్టెంబర్ 05:

ఎందరో అమరుల బలిదానాలు, ప్రజల పోరాటాలు, ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు ఇంకా పూర్తిస్థాయిలో నెరవేరలేదని, నీళ్లు, నిధులు, నియామకాలు, ఉచిత విద్య, ఉపాధి, నాణ్యమైన ఉచిత వైద్యం, సమానత్వం, సమాన హక్కుల కోసం మరో ప్రజా ఉద్యమం అవసరమని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమంలో ప్రజాసంఘాలు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, మేధావులు, ఉద్యమకారులు కీలక పాత్ర పోషించారని, అయితే రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా సామాన్య ప్రజల జీవితాల్లో ఆశించిన స్థాయిలో మార్పు కనిపించడం లేదన్నారు. గత పాలకులు, ప్రస్తుత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడంలో పోటీపడుతున్నారనే విమర్శలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని తెలిపారు.ఈ పరిస్థితుల్లో పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామిక శక్తులన్నీ ఏకమై నూతన ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం మరో ప్రజా పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చింది.
*32 ప్రజాసంఘాలతో తెలంగాణ జేఏసీ పునర్నిర్మాణం*
ప్రజల హక్కులు, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 32 ప్రజాసంఘాల ప్రతినిధులు ఏకమై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీని బలోపేతం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌గా హైకోర్టు అడ్వకేట్ జి. కరుణాకర్ రెడ్డిని ఎన్నుకుని, ఆయన నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రజాసంఘాలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులను సమన్వయం చేస్తూ జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
**నల్లగొండ జిల్లా చైర్మన్‌గా ఎంపల్ల పురుషోత్తం రెడ్డి*
ఈ క్రమంలో నల్లగొండ రైల్వేస్టేషన్ సమీపంలోని ఓపెన్ పార్కులో నల్లగొండ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ప్రజాసంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజాస్వామికవాదులు, ఉద్యమకారులు, ప్రజలతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో శాలిగౌరారం మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన ఎంపల్ల పురుషోత్తం రెడ్డిని తెలంగాణ జేఏసీ నల్లగొండ జిల్లా చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జి. కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంపల్ల పురుషోత్తం రెడ్డి ఎన్నిక రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ నిర్ణయమని తెలిపారు. నల్లగొండ జిల్లాలోని అన్ని ప్రజాసంఘాలు, ప్రజాస్వామిక శక్తులను సమన్వయం చేస్తూ ప్రజా సమస్యలపై ఉద్యమాలను నిర్మించాలని సూచించారు.
*అన్ని శక్తులను కలుపుకుని పోరాడుతా: ఎంపల్ల పురుషోత్తం రెడ్డి*
తనపై నమ్మకంతో నల్లగొండ జిల్లా చైర్మన్‌గా ఎన్నుకున్న తెలంగాణ జేఏసీ రాష్ట్ర కమిటీకి, రాష్ట్ర చైర్మన్ జి. కరుణాకర్ రెడ్డికి ఎంపల్ల పురుషోత్తం రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.నల్లగొండ జిల్లాలోని అన్ని ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు, కార్మికులు, కర్షకులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, రాజకీయ పార్టీలను కలుపుకుని నూతన ప్రజాస్వామిక తెలంగాణ కోసం జరిగే పోరాటంలో ముందుండి పనిచేస్తానని తెలిపారు.
తన ఎన్నికకు సహకరించిన నల్లగొండ జిల్లా ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు, మేధావులకు, ఉద్యమకారులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.తెలంగాణ అంటే కేవలం ఒక రాష్ట్రం ఏర్పడటం కాదు.. ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు రావడం.
అమరుల త్యాగాలకు నిజమైన నివాళి అంటే.. ప్రతి పేదవాడికి న్యాయం, ప్రతి యువకుడికి ఉపాధి, ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్యం, ప్రతి బిడ్డకు ఉచిత విద్య, ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించే తెలంగాణను నిర్మించడం.
అందుకోసం ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఏకమై నూతన ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం మరో ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాలని సమావేశం పిలుపునిచ్చింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ జి. కరుణాకర్ రెడ్డి, విశ్వహిందూ పరిషత్ ప్రఖండ నాయకులు పైళ్ల మన్మధరెడ్డి, రిటైర్డ్ టీచర్ యానాల పాపిరెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు ముచ్చపోతుల వెంకన్న, గంధం అశోక్, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు యార శ్రీను, వేల్పుల వెంకన్న, బహుజన సమాజ్ పార్టీ నాయకులు వేముల సహదేవుడు, చింతపల్లి సైదులు, తెలగమల్ల యాదగిరి, శనగోని సత్తయ్య, తండు పున్నయ్య, సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ భూమి రిపోర్టర్ వేముల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Friday, September 4, 2026

అంబర్పేట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ నగర మాజీ మేయర్ కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు_

*అంబర్పేట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ నగర మాజీ మేయర్ కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 04:

అంబర్ పేట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు, విద్యావేత్త. బహుముఖ ప్రజ్ఞాశీలి. ముదిరాజ్ సంఘపు స్థాపకుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సంఘం నాయకుడు, సీనియర్ జర్నలిస్ట్  సతీష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అంబర్ పేట స్విమ్మింగ్ పూల్ వద్ద నిర్వహించిన ఈ వేడుకలలో పెద్ద సంఖ్యలో ముదిరాజ్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డిసిపి జోగుల నర్సయ్య ముఖ్య అతిథిగా పాల్గొని కొర్వి  కృష్ణ స్వామి ముదిరాజ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా అడిషనల్ డిసిపి నర్సయ్య మాట్లాడుతూ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ 1893, ఆగష్టు 25 న కృష్ణాష్టమి రోజు జాల్నాలోని ఒక పేద రైతు కుటుంబంలో జన్మించాడు అని ఎంతో కష్టపడి చదువుకొని చాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్, ఆ తరువాత నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు అని రచయితగా, సాహితీవేత్తగానే కాకుండా పాత్రికేయుడిగా కూడా ఆయన సేవలందించారు అని సామాజిక రుగ్మతలపై అనేక పుస్తకాలు వ్రాశాడు అని గుర్తుచేశారు.ఈ సందర్భంగా  ముదిరాజ్ సంఘం నాయకురాలు మాట్లాడుతూ అంబర్ పేటలో మాజీ మేయర్ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.అంబర్ పేట శ్రీ రమణ చౌరస్తా, చే నంబర్, ఎమ్మార్వో ఆఫీస్, అలీ కేఫ్ చౌరస్తాలలో ఏదైనీ ప్రాంతంలో కృష్ణ స్వామి ముదిరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు.

"మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి"_

*ప్రచురణార్థం :*

*"మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి"*

*హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ పరంజ్యోతి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 03:

హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ పరంజ్యోతి గారు ఈరోజు హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ జిందాబాద్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిఈ పరంజ్యోతి మాట్లాడుతూ... రాబోయే వినాయక చవితికి మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించాలని, పర్యావరణ పర్యావరణాన్ని కాపాడాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించాలని, హెచ్ఎండిఏ ప్రతి సంవత్సరం ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నదని అన్నారు.
హైదరాబాద్ జిందాబాద్, హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం (HCF) ప్రధాన కార్యదర్శి  కె.వీరయ్య మాట్లాడుతూ... ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ప్రతిష్టించడం వలన నగరంలో హుస్సేన్ సాగర్ మరియు  చెరువులు కుంటలు కాలుష్యానికి గురవుతున్నాయని, పర్యావరణానికి హానికరం కాని మట్టి గణపతి విగ్రహాలనే  ప్రతిష్టించాలని పిలుపు నిచ్చారు. నగరంలో  వైభవంగా  నిర్వహించుకొనే  “వినాయక చవితి” పండుగ  సందర్భంగా  అందరూ ఇండ్లలోనూ, అపార్ట్‌మెంట్స్, కాలనీ, బస్తీలలో సామూహికంగాను మట్టి గణపతి విగ్రహాలను  ప్రతిష్టించాలని అన్నారు.  నగరంలో ఇప్పటికే పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి, మరింతగా పెరగకుండా  ఉండటానికి అందరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. గౌరవ హైకోర్టు “ పర్యావరణానికి హాని చెయ్యని మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలని, విగ్రహాల ఎత్తు ఐదు అడుగులు మించకుండా చూడాలని” సూచించిందని అన్నారు. భక్తుల విశ్వాసాలను, సమాజ భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని గౌరవ హైకోర్టు ఇచ్చిన సూచనలను అందరం పాటిద్దాం అని అన్నారు.వినాయక  విగ్రహాలలో అత్యధికం ప్లాస్టర్ ఆఫ్  పారిస్‌తో అనేక రకాల రసాయనిక రంగులతో తయారవుతున్నాయని, ఈ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లోను, నగరంలోని వివిధ చెరువులలో నిమజ్జనం చెయ్యటం జరుగుచున్నదని చెప్పారు. పర్యావరణ వేత్తల లెక్కల ప్రకారం నిమజ్జనం సమయంలో ఒక్క రోజులోనే హుస్సేన్ సాగర్‌లో  8,000 నుండి 9,000 టన్నుల ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్లాస్టిక్ , పాదరసం, సీసం, నిహాల్, టర్పెంటైన్, రెడ్ ఆక్సైడ్, సిలికాన్ వంటి అనేక విష రసాయనాలు ఉంటున్నాయని కె. వీరయ్య అన్నారు. ఈ విష రసాయనాలు  హుస్సేన్‌సాగర్ మరియు చెరువులలో  కలవటం వలన కాలుష్య సాగరాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
*“మానవ సేవే మాధవ సేవ”*, మానవ సమాజ మనుగడకే ముప్ప్పుగా పరిణమిస్తున్న కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అవసరముందని అన్నారు. నగరంలోని కొన్ని చెరువుల చుట్టు ప్రక్కల కాలనీలలోని డ్రైనేజి పైప్ లైన్లు ఆయా చెరువులలో కలిపేస్తున్నారని, ఫలితంగా చెరువులన్నీ కాలుష్య భరితమై దుర్గంధంతో దోమల కేంద్రాలుగా తయారయ్యాయని అన్నారు. వీటికి తోడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయరైన విగ్రహాల నిమజ్జనం ఫలితంగా కాలుష్యం మరింత పెరిగి  పరిసర కాలనీల ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం చూపిస్తున్నాయాని చెప్పారు. వీటి కారణంగా  క్యాన్సర్, చర్మవ్యాధులకు గురికావలసి వస్తున్నదని అన్నారు.గత 10 సంవత్సరాల నుండి *“హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం”( హైదరాబాద్ జిందాబాద్)*  ఆధ్వర్యంలో  హెచఎండిఏ సహకారంతో  గ్రేటర్‌లోని 45 కాలనీలలో, అపార్ట్‌మెంట్‌లలో  మట్టి గణపతుల ఉచిత పంపిణి చేస్తున్నామని,పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను భక్తితో అందరం పూజిద్దాం అని అన్నారు.ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం *రామంతాపూర్ లో "శ్రీనిధి మహిళా ఫౌండేషన్" ఫౌండర్ చైర్మన్ బాపట్ల పుష్పలత మరియు ఫౌండేషన్ సభ్యులు, "ప్రజాసంకల్పం" ఫౌండర్ బాపట్ల కృష్ణమోహన్*  గత 10 సంవత్సరాలనుండి హైదరాబాద్ సిటిజెన్స్ ఫోరం (హైదరాబాద్ జిందాబాద్)  ఆధ్వర్యంలో హెచఎండిఏ సహకారంతో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి గణపతుల ఉచిత పంపిణి చేస్తున్నారు.పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హెచ్ఎండిఏ సూపరిండెంట్ ఇంజనీర్  అప్పారావు గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారు, హైదరాబాద్ జిందాబాద్ నాయకులు ఎం.శ్రీనివాసరావు, మోహన్ నాయుడు, పి.శ్రీనివాసరావు, గోపాల్, మల్లం రమేష్, బాపట్ల కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.

'గొల్లల గుడి’ని జాతీయ ప్రాధాన్య కట్టడంగా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు_

*‘గొల్లల గుడి’ని జాతీయ ప్రాధాన్య కట్టడంగా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 03:

తెలంగాణలోని ములుగు జిల్లా, పాలంపేటలో గల ‘గొల్లల గుడి’ని జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీచేసింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ పరిధిలోని భారత పురావస్తు అధ్యయన విభాగం (ఏఎస్‌ఐ)  జారీ చేసిన 31.08.2026 నాటి ప్రకటన నెం.ఎస్‌.ఒ.4802(ఇ) ‘గెజిట్ ఆఫ్ ఇండియా’(ప్రత్యేక సంచిక) పార్ట్‌- IIలోని సెక్షన్‌ 3 ఉప సెక్షన్‌ (ii) కింద ప్రచురితమైంది. 
“ప్రాచీన కట్టడాలు-పురావస్తు ప్రదేశాలు-అవశేషాల చట్టం- 1958” (1958నాటి 24వ చట్టం)లోని సెక్షన్ 4, ఉప-సెక్షన్ (3) కింద సంక్రమించిన అధికారాల మేరకు ‘ఏఎస్‌ఐ’ ఈ ప్రకటన జారీ చేసింది. ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ‘కాకతీయ రుద్రేశ్వర’ (రామప్ప) ఆలయానికి నైరుతి దిశలో ఈ ‘గొల్లల గుడి’ ఉంటుంది. ఇది తూర్పు ముఖంగా గల మండపం, దాని చుట్టూ మూడు గర్భాలయాలతో కూడిన ‘త్రికూటాలయం’గా కనిపిస్తుంది.గుడి ప్రహరీ శిల్పాలంకృతమై, పైకప్పు అంచు నిర్మాణం, ద్వారబంధాల వద్ద చెక్కిన హంసల వరుసతో, ‘సునిశిత రంధ్రాల వల’ పనితనంతో ఈ ఆలయం ఎంతో విశిష్టమైనదిగా అలరారుతోంది.ళఈ ప్రధాన గుడికి ముందు వైపున రెండు ప్రత్యేక ఉప ఆలయాలు ఎంతో అందంగా చెక్కిన ద్వారపాలకుల విగ్రహాలతో అలంకృతమై ఉంటాయి. వీటికి ముందు గల అంతరాలయాల అంచులు కూడా చక్కని తెరలతో శోభాయమానంగా కనిపిస్తాయి.
ప్రధాన ఆలయ నిర్మాణం ముందు భాగాన మండపం గుండా మధ్యలో గల ప్రధాన మందిరానికి మార్గం ఉంటుంది. దీనికి ఉత్తర, దక్షిణ, పశ్చిమ దిశలలో అంతరాలయాలతో మూడు గర్భాలయాలు కూడా ఉంటాయి. ఆలయ కుడ్యాలపై కనిపించే వివిధ గూళ్లలో విష్ణుమూర్తి, లక్ష్మి, గణేశుడు, మహిషాసురమర్దిని విగ్రహాలు దర్శనమిస్తాయి. జంతువుల ఆకారాలు, పుష్పాలంకరణతో కూడిన ఎత్తయిన వేదికపై ఈ ఆలయం నిర్మితమైంది.

అధికారులు అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం మాత్రమే కాదు, ఆచరించి చూపించిన సీఎండీ_

*మల్కరంలో విద్యుత్ సిబ్బంది భద్రతను టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్ స్వయంగా తనిఖీ చేశారు*

*అధికారులు అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం మాత్రమే కాదు, ఆచరించి చూపించిన సీఎండీ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 03:

అధికారులు అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం మాత్రమే కాదు, ఆచరించి చూపించడం అని ఈ స్ఫూర్తిని ప్రదర్శిస్తూ, టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ మరియు ఐఏఎస్ అధికారి జితేష్ వి. పాటిల్, "బస్తీ బటా" కార్యక్రమంలో భాగంగా, క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బంది అనుసరిస్తున్న భద్రతా పద్ధతులను తనిఖీ చేయడానికి చేవెళ్ల సెక్షన్ పరిధిలోని మల్కరం గ్రామంలోని ఒక విద్యుత్ స్తంభాన్ని స్వయంగా ఎక్కారు.తనిఖీని కేవలం కార్యాలయ సమీక్షకు పరిమితం చేయకుండా, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి మరియు విద్యుత్ లైన్లు, స్తంభాలపై పనిచేసేటప్పుడు అనుసరిస్తున్న భద్రతా విధానాలను వ్యక్తిగతంగా అంచనా వేయడానికి జితేష్ వి. పాటిల్ స్వయంగా క్షేత్రస్థాయిలోకి అడుగుపెట్టారు.ప్రతి క్షేత్రస్థాయి కార్యకలాపంలో భద్రతకే అత్యధిక ప్రాధాన్యత ఉండాలని నొక్కి చెబుతూ, ఆయన వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ), భద్రతా పరికరాలు, పని పద్ధతులు మరియు ముందుజాగ్రత్త చర్యల వినియోగాన్ని తనిఖీ చేశారు.ఉద్యోగుల భద్రత విషయంలో ఎటువంటి రాజీకి తావులేదని సీఎండీ గట్టిగా స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది అందరూ నిర్దేశించిన భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని, మినహాయింపు లేకుండా పీపీఈ (PPE)ని ఉపయోగించాలని ఆయన ఆదేశించారు.ఆయన స్వయంగా రంగంలోకి దిగిన తీరు సిబ్బందికి ఒక బలమైన సందేశాన్ని పంపింది. ఉన్నతాధికారులు తమ ఉద్యోగులకు అండగా నిలుస్తారని, వారి సవాళ్లను అర్థం చేసుకుంటారని మరియు వారి ప్రాణాలకు, భద్రతకు అన్నింటికన్నా అధిక ప్రాధాన్యత ఇస్తారని అన్నారు.క్షేత్రస్థాయి తనిఖీలో వ్యక్తిగతంగా పాల్గొనడం ద్వారా, శ్రీ జితేష్ వి. పాటిల్ లాంటి అధికారులు క్షేత్రస్థాయిలో ఉండటం, ఆదర్శంగా నిలవడం మరియు ప్రజలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అని నిరూపించారు.