Wednesday, July 29, 2026

మత్తుపదార్థాలకు దూరంగా ఉందాం ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకుందాం - మల్కాజ్గిరి పోలీస్_

*మత్తుపదార్థాలకు దూరంగా ఉందాం ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకుందాం - మల్కాజ్గిరి పోలీస్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 28:

రామంతాపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 'యాంటీ-డ్రగ్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్' (Anti-Drug Awareness Program) నిర్వహించడం జరిగింది. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, ఆరోగ్య సమస్యలు మరియు చట్టపరమైన చర్యల గురించి విద్యార్థులకు పోలీసులు అవగాహన కల్పించారు.
యువత తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో మనందరం భాగస్వాములం అవుదాం! అనే నినాదాలతో విద్యార్థులకు అవగాహన కల్పించారు.
*ముఖ్య గమనిక*: మీ చుట్టుపక్కల ఎక్కడైనా డ్రగ్స్ విక్రయాలు లేదా వినియోగం జరిగితే వెంటనే డయల్ 100 కి లేదా ఉప్పల్ పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని పోలీస్ అధికారులు అన్నారు .

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్రదానం చేయనున్న టెలివిజన్ అవార్డులు_

*తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్రదానం చేయనున్న  టెలివిజన్ అవార్డులు*

*టెలివిజన్ అవార్డుల రూపకల్పనలో తెలంగాణ ఆత్మ ప్రతిబింబించాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 28:

రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న టెలివిజన్ (టీవీ) అవార్డుల రూపకల్పన, మార్గదర్శకాలు, లోగో, అవార్డుల పేర్లు తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధ్యక్షతన టెలివిజన్ అవార్డుల కమిటీతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీ శంకర్ నాయక్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముకుంద రెడ్డి, టెలివిజన్ అవార్డుల కమిటీ చైర్మన్, సభ్యులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో టెలివిజన్ అవార్డులకు ప్రత్యేక లోగో రూపకల్పన, అవార్డులకు ప్రముఖ వ్యక్తి పేరును ప్రతిపాదించడం, వివిధ విభాగాల్లో అవార్డుల ప్రదానం, ఎంపిక విధానం, అవార్డుల ప్రదానోత్సవ వేదిక వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, టెలివిజన్ రంగం అత్యధిక వినోదాన్ని అందించే మాధ్యమమని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు టెలివిజన్ కార్యక్రమాల పట్ల విశేష ఆసక్తి చూపుతున్నారని అన్నారు. టెలివిజన్ రంగంలో ప్రతిభ కనబరిచిన అన్ని విభాగాల కళాకారులు, సాంకేతిక నిపుణులు, మంచి సామాజిక సందేశాలను అందించే సీరియళ్లు, కార్యక్రమాలు, బాలల చిత్రాలను రూపొందించే వారిని ప్రోత్సహించేలా అవార్డులను రూపొందిస్తామని తెలిపారు.కమిటీ సభ్యులు సూచించిన విధంగా టెలివిజన్ అవార్డులకు మాజీ ప్రధానమంత్రి  పి.వి. నరసింహారావు పేరు పెట్టే అంశాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తానని మంత్రి తెలిపారు. బహుభాషా కోవిదుడైన పి.వి. నరసింహారావు దేశ ఆర్థిక సంస్కరణలకు పునాది వేసిన మహనీయుడని, అలాంటి మహోన్నత వ్యక్తుల పేర్లను పరిశీలించడంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందన్నారు.టెలివిజన్ అవార్డులకు సంబంధించిన మార్గదర్శకాలు, లోగో, అవార్డుల పేర్లు తదితర అంశాలను వీలైనంత త్వరగా సిద్ధం చేసి సమర్పించాలని కమిటీని మంత్రి ఆదేశించారు. అవార్డుల పేరు, లోగో తెలంగాణ ఆత్మను, సంస్కృతిని, ప్రత్యేకతను ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు.రాష్ట్రంలో తొలిసారిగా ప్రదానం చేయనున్న ఈ టెలివిజన్ అవార్డులను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని, అవార్డు గ్రహీతల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగాలని కమిటీ చైర్మన్, సభ్యులకు మంత్రి సూచించారు.
అవార్డుల నిర్వహణలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముకుంద రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని, అవార్డుల ప్రదానోత్సవానికి రెండు లేదా మూడు వేదికల ఎంపికలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
సమావేశంలో వచ్చిన అన్ని ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో చర్చించిన అనంతరం టెలివిజన్ అవార్డులపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో "ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్" కార్యక్రమం_

*తెలంగాణ డీజీపీ కార్యాలయంలో "ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్" కార్యక్రమం*

*ఈ శిక్షణ అనంతరం పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల వస్తుందని ఆశిస్తున్నాను - సీ.వి.ఆనంద్ డిజిపి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 28:

తెలంగాణ రాష్ట్ర డిజిపి సీ.వి.ఆనంద్ జిల్లాల పర్యటనల సందర్భంగా వివిధ బడ్జెట్ హెడ్స్ లో నిధులు మంజూరు కావడం లేదని పలువురు అధికారులు డిజిపి దృష్టికి తీసుకువచ్చారు. అయితే, ప్రధాన కార్యాలయానికి తిరిగి వచ్చిన తర్వాత దీనిపై సమగ్రంగా పరిశీలించగా, బిల్లులను ఎలా క్లెయిమ్ చేయాలి, వాటిని ఏ విధంగా అకౌంటింగ్ చేయాలి అనే ప్రక్రియపై తగిన అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమని తెలిసింది అని డిజిపి అన్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు డిజిపి కార్యాలయంలో "ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్" కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అని అన్నారు. ఈ శిక్షణలో బిల్లులను ఏ విధంగా సమర్పించాలి, ఏయే గడువులను తప్పనిసరిగా పాటించాలి, అలాగే వాటిని ఎలా పరిశీలించి ధృవీకరించాలి అనే అంశాలను సవివరంగా వివరిస్తున్నారు అని తెలిపారు. ఈ శిక్షణ అనంతరం పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల వస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు.

బీజేపీ ప్రతినిధి, సంజు వర్మ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం_

*ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన:*

*బీజేపీ ప్రతినిధి, సంజు వర్మ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 28:

గత ఆరు వారాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఆరుసార్లు ప్రశ్నపత్రాల లీకేజీ జరిగిందని జాతీయ స్థాయి టీవీ చర్చలో బీజేపీ ప్రతినిధి, సంజు వర్మ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఇందులో ఎటువంటి నిజము లేదు.తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం అందించిన సమాచారం ప్రకారం, డిసెంబర్ 7, 2023 నుండి రాష్ట్రంలో నిర్వహించిన ఏ పరీక్షలోనూ ప్రశ్నపత్రం లీక్ కాలేదు.గత ఆరు వారాల్లో తెలంగాణలో ఆరుసార్లు ప్రశ్నపత్రాల లీకేజీ జరిగిందన్న ఆరోపణ పూర్తిగా వాస్తవానికి విరుద్ధం.ప్రజలు, తప్పుడు సమాచారాన్ని నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం అధికారిక మాధ్యమాల ద్వారా విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి.

Saturday, July 25, 2026

డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ (FAC) అధికారిపై సమగ్ర విచారణ చేపట్టాలి_

*డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ (FAC) అధికారిపై సమగ్ర విచారణ చేపట్టాలి*

*నో యువర్ రైట్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్‌కు ఫిర్యాదు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 25:

నో యువర్ రైట్స్ సొసైటీ (రిజి. నెం. 177/2019) అధ్యక్షులు ఎస్. ఉమేష్ కుమార్ ఈరోజు హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (IPM) డైరెక్టర్‌ను కలిసి, ప్రస్తుతం *డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ (FAC)గా పనిచేస్తున్న శ్రీ వాపర్ల ఆనందరావు* సేవా వ్యవహారాలకు సంబంధించిన అభియోగాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.
వినతిపత్రంలో అందుబాటులో ఉన్న అధికారిక రికార్డులు, న్యాయస్థానాల్లో జరిగిన న్యాయ ప్రక్రియలు మరియు ఇతర సమాచారం ఆధారంగా పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఆయన నియామకాలు, బదిలీలు, పదోన్నతులు, నోషనల్ ప్రమోషన్లు, ప్రభుత్వ అనుమతి లేకుండా స్వీయ రిలీవింగ్ ఆర్డర్ జారీ చేసుకున్నారనే అభియోగాలు, అలాగే అసాధారణ సెలవు (E.O.L.) తదితర అంశాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.
అదేవిధంగా, సంబంధిత న్యాయస్థానాల్లో దాఖలైన కేసులు, ప్రభుత్వ ఉత్తర్వులు, సేవా నియమావళి మరియు శాఖ రికార్డులను పరిశీలించి, నోషనల్ ప్రమోషన్లు నిబంధనలకు అనుగుణంగా మంజూరయ్యాయా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.నో యువర్ రైట్స్ సొసైటీ అధ్యక్షులు ఎస్. ఉమేష్ కుమార్ మాట్లాడుతూ, ఈ ఫిర్యాదు పూర్తిగా ప్రజా ప్రయోజనం, పారదర్శకత, జవాబుదారీతనం మరియు సహజ న్యాయం (Natural Justice) సూత్రాల పరిరక్షణ కోసమే సమర్పించబడిందని తెలిపారు. వాస్తవ నిర్ధారణ అవసరమైన అంశాలన్నింటినీ వినతిపత్రంలో "అభియోగాలు" (Alleged) అనే పదంతోనే పేర్కొన్నామని, ఎవరిపైనా ముందస్తు నిర్ణయానికి రావడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.సంబంధిత అధికార యంత్రాంగం ఈ అంశంపై నిష్పక్షపాతంగా, సమగ్రంగా విచారణ జరిపి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని నో యువర్ రైట్స్ సొసైటీ కోరింది.

ప్రతి నీటి చుక్కను సంరక్షించుకోవడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత: మంత్రి పొన్నం ప్రభాకర్_

*"ప్రతి నీటి చుక్కను సంరక్షించుకుందాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం"*

*ప్రజలు కూడా దీనిని తమ సామాజిక బాధ్యతగా స్వీకరించాలి*

*ప్రతి నీటి చుక్కను సంరక్షించుకోవడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత: మంత్రి పొన్నం ప్రభాకర్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 25:

హైదరాబాద్‌లో భూగర్భ జలాలను పరిరక్షించడం, వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (జలమండలి) ఆధ్వర్యంలో నిర్వహించిన వర్షపు నీటి సంరక్షణ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంజెక్షన్ పాయింట్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, హార్వెస్టింగ్ బోర్‌వెల్స్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం "ప్రతి నీటి చుక్కను సంరక్షించుకుందాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం" అనే నినాదంతో మొక్కలు నాటి, వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలను కాపాడేందుకు ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సైఫాబాద్ సైన్స్ కళాశాల విద్యాబోధనతో పాటు వర్షపు నీటి సంరక్షణలో ఆదర్శంగా నిలుస్తూ సమాజానికి మార్గదర్శకత్వం వహించడం అభినందనీయమన్నారు.నేటి పరిస్థితుల్లో ప్రతి వ్యవస్థ నీటిపైనే ఆధారపడి ఉందని, కురిసే వర్షపు నీటిని డ్రైనేజీల ద్వారా వృథాగా కాలువల్లోకి వెళ్లనివ్వకుండా భూగర్భ జలాల్లోకి ఇంకేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో రాతి నిర్మాణాలు, సిమెంట్ రోడ్ల విస్తరణ కారణంగా వర్షపు నీరు సహజంగా భూమిలోకి ఇంకే పరిస్థితి తగ్గిపోయిందని, అందువల్ల నగరంలోని ప్రతి ఇల్లు, ప్రతి సంస్థలో ఇంకుడు గుంతలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.నిజాం కాలం నుంచే హైదరాబాద్‌లో నీటి సంరక్షణ కోసం అనేక చెరువులు నిర్మించారని గుర్తు చేసిన మంత్రి, ఆ సంప్రదాయాన్ని ఆధునిక పద్ధతులతో కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. 2016 నుంచి హైదరాబాద్‌లో భవన నిర్మాణ అనుమతుల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థను తప్పనిసరి చేసిన విషయాన్ని గుర్తుచేశారు.గత కొద్ది రోజులుగా నగరంలో రోజువారీ నీటి ట్యాంకర్ల వినియోగం సుమారు 4 వేల నుంచి 12 వేల వరకు పెరిగిందని పేర్కొంటూ, ఇది రాబోయే నెలల్లో నీటి అవసరం మరింత పెరిగే సూచనగా భావించాలన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించడంతో పాటు భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్‌లో ఇప్పటికే 3 వేల నుంచి 4 వేల వరకు బోర్‌వెల్స్ ఎండిపోయాయని, అలాంటి బోర్‌వెల్స్‌కు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంజెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేస్తే అవి తిరిగి నీటి నిల్వలను పొందే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం హార్వెస్టింగ్ వ్యవస్థలను ప్రోత్సహిస్తున్నప్పటికీ ప్రజలు కూడా దీనిని తమ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని కోరారు.కృష్ణా, గోదావరి, నాగార్జునసాగర్, సింగూరు, మంజీరా, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టుల ద్వారా రైతుల అవసరాలను సమన్వయం చేస్తూ హైదరాబాద్ నగరానికి తాగునీరు అందిస్తున్నప్పటికీ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వర్షపు నీటి సంరక్షణే శాశ్వత పరిష్కారమని మంత్రి అన్నారు.2024 అక్టోబర్ 2న రాష్ట్రంలో భారీ స్థాయిలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ఈ కార్యక్రమం అమలులో రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉండగా, త్వరలోనే మొదటి స్థానానికి చేరుకునే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
త్వరలోనే మంత్రుల నివాసాలు, కార్యాలయాలు, శాసనసభ, ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలోనూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్‌ను తప్పనిసరి చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి కుటుంబం తమ ఇళ్లలోనే కాకుండా బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా హార్వెస్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేసేలా చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు.రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌ను ఒక ఉద్యమంగా, సామాజిక బాధ్యతగా తీసుకుని ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టుకోవాలని, తద్వారా భావితరాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించగలమన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్‌ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.హైదరాబాద్‌లో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విధానాన్ని అమలు చేస్తోందని, వాహనం కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికీ ఒక మొక్కను అందించే కార్యక్రమాన్ని కూడా ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ అద్దంకి దయాకర్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ శ్రీ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రియాంక అల, జలమండలి ఎండీ శ్రీ అశోక్ రెడ్డి, సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, ప్రజాప్రతినిధులు, అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

Thursday, July 23, 2026

బాలలహక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి అచ్యుతరావు 6వ వర్ధంతి

*బాలల హక్కుల కార్యకర్త (Child Rights Activist) మరియు బాలల హక్కుల సంఘం వ్యవస్థాపకుడు పీ. అచ్యుతరావు 6వ వర్ధంతి*

*బాలల హక్కుల ఉద్యమకారుడిగా దేశవ్యాప్త గుర్తింపు పొందిన అచ్యుత రావు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 21:

బాలల హక్కుల సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ అచ్యుత రావు గారు మనలను విడిపోయి అప్పుడే ఆరు సంవత్సరాలు అయింది. బాలల హక్కులకు ఎక్కడ ఆటంకమైన మరు నిమిషం తను వారికి అండగా ఉండేవారు,24/7 వారికి నేనున్న అనే భరోసా ఇచ్చేవారు.ఎక్కడ ఎవరికి తలొగ్గే వారు కాదు. చిన్నారులకు న్యాయం జరిగే వరకు పోరాడిన మహోన్నత వ్యక్తి.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రముఖ బాలల హక్కుల కార్యకర్త (Child Rights Activist) మరియు బాలల హక్కుల సంఘం వ్యవస్థాపకుడు పీ. అచ్యుతరావు. సుమారు 30 ఏళ్లకు పైగా హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసిన ఆయన, బాల్య వివాహాలు, బాల కార్మికుల వ్యవస్థ, మరియు పిల్లలపై జరిగే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించారు.తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ బాలల హక్కుల ఉల్లంఘన జరిగినా స్పందించి, పిల్లల రక్షణకు, పునరావాసానికి తన ఎన్జీవో ద్వారా ఎనలేని కృషి చేశారు.ఆయన జూలై 22, 2020న కరోనా వైరస్ (COVID-19) బారిన పడి, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.అచ్యుత రావు గారి జ్ఞాపకార్థం ఈ రోజు  22 వ తేది హిమాయత్ నగర్ లోని భూలక్ష్మి గుడి దగ్గర మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించాము అని బాలలహక్కుల సంఘం ప్రస్తుత అధ్యక్షురాలు అనూరాధ రావు గారు తెలియచేశారు.ఈ అన్న ప్రసాద కార్యక్రమంలో 500 కు పైగా  పాల్గొన్నారు.