Sunday, August 16, 2026

గోదావరి పుష్కరాల పై కేబినేట్ సబ్ కమిటి ఏర్పాటు_

*గోదావరి పుష్కరాలను ఘనంగా  నిర్వహించాలి*

*గోదావరి పుష్కరాల పై కేబినేట్ సబ్ కమిటి ఏర్పాటు*

*క్యాబినెట్‌ సబ్‌ కమిటీ చైర్మన్‌, మంత్రి  డి. శ్రీధర్‌బాబు అధికారులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 14:

26 జూన్ 2027 నుంచి 7 జూలై 2027 వరకు గోదావరి నది తీరం పుష్కర శోభతో విరాజిల్లేలా, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని గోదావరి పుష్కరాల పై ఏర్పాటు చేసిన కేబినేట్ సబ్ కమిటి సంకల్పించింది.పుష్కరాల సందర్భంగా గోదావరి తీరం వెంబడి ఘాట్ల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్‌, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలను పకడ్బందీగా ఏర్పాటు చేసి, దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.ఈ దిశగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ చైర్మన్‌, మంత్రి  డి. శ్రీధర్‌బాబు అధ్యక్షతన జరిగిన కీలక సమావేశం అధికారులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేసింది. ఈ సమావేశంలో మంత్రులు శ్రీమతి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, పలు శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.26 జూన్ 2027 నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, భక్తులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, వివిధ శాఖల సమన్వయం తదితర అంశాలపై సమావేశంలో కేబినేట్ సబ్ కమిటి ఛైర్మన్ శ్రీధర్ బాబు నేతృత్వంలోని మంత్రుల బృందం కూలంకషంగా చర్చించింది.  దేవాదాయ శాఖ, ఆర్ అండ్ బి, నీటిపారుదల, పోలీస్, టూరిజం, టిజిఎన్పిడిసిఎల్, వైద్యారోగ్యం, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్టమెంట్, గ్రామీణ నీటిపారుదల తదితర శాఖలు చేపడుతున్న పనుల వివరాలను మంత్రుల బృందం ఆరా తీసింది. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లు, శాఖల వారీగా కొనసాగుతున్న పనుల పురోగతిని అధికారులు మంత్రులకు వివరించారు. 
పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్ల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, రవాణా, విద్యుత్‌, వైద్య, భద్రత తదితర సదుపాయాల కల్పనపై మంత్రులు ప్రత్యేకంగా శాఖల వారీగా చర్చించారు. పుష్కరాల ప్రారంభానికి ముందే అన్ని పనులను నాణ్యతతో, సమన్వయంతో పూర్తి చేసి భక్తులకు ఆధ్యాత్మిక, ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
గోదావరి నదీ తీరాన వున్న నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పుష్కర ఘాట్లుగా తీర్చిదిద్దనున్న మొత్తం 67 కేంద్రాలను 3 అంచెల్లో అభివృద్ధి చేయనున్నట్లు కమిటి కన్వీనర్, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ మంత్రుల బృందానికి వివరించారు. గోదావరి పుష్కరాల సమగ్ర ఏర్పాట్ల కోసం రూ. 1000 కోట్లతో వివిధ శాఖల పరిధిలో  పనులు జరుగుతున్నట్లు  వివరించారు.ఈ సందర్భంగా కేబినేట్ సబ్ కమిటి ఛైర్మన్, మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, గోదావరి పుష్కరాల పనుల పురోగతిని సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. వీలుకాని పక్షంలో వర్చువల్ మీటింగ్ ల ద్వారా పనులను సమీక్షించాలని సూచించారు. గోదావరి పుష్కరాలను సీఎం రేవంత్ రెడ్డిగారు ప్రతిష్టాత్మక కార్యక్రమంగా భావిస్తున్నందున ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకోవాలని అధికారులకు నిర్దేశించారు.  
పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన పనుల పురోగతిని ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు డ్యాష్‌బోర్డు ద్వారా సమీక్షించేందుకు వీలుగా, శాఖల వారీగా చేపడుతున్న పనులు, పురోగతి తదితర వివరాలు అందుబాటులో ఉండేలా డ్యాష్‌బోర్డును రూపొందించాలని అధికారులను శ్రీధర్ బాబు ఆదేశించారు. గోదావరి పుష్కరాల నిమిత్తం స్పెషల్ ఫండ్స్ కావాలని పలువురు ప్రజాప్రతినిధుల నుంచి వినతుల వస్తున్నందున ఈ విషయమై ముఖ్యమంత్రిగారితో చర్చిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి తీర ప్రాంతం సుదీర్ఘంగా వున్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి గోదావరి పుష్కరాలను వైభవోపేతంగా నిర్వహించాలని సూచించారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలకు ఎంచుకున్న ప్రాంతాల్లో ఆయా క్షేత్రాల మహాత్మ్యాన్ని, చారిత్రక–ఆధ్యాత్మిక విశిష్టతను తెలియజేసేలా స్వాగత ద్వారాలు, ప్రత్యేక అలంకరణలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఆయా క్షేత్రాల విశిష్టతను పరిచయం చేసేలా సమాచార బోర్డులు, దృశ్యరూప ప్రదర్శనలు ఏర్పాటు చేసి, గోదావరి పుష్కరాల వైభవం ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖలు పనులు పునరావృతం కాకుండా సమన్వయంతో చేయాలని సూచించారు.భక్తులకు ఆరోగ్య సమస్యలు ఎదురైతే చికిత్స అందించడానికి వైద్యారోగ్య శాఖతో పాటు ముందుకు వచ్చే ప్రైవేట్ హాస్పిటళ్ళ సహకారం తీసుకోవాలని మంత్రి వైద్యారోగ్య శాఖకు సూచించారు. అనంతరం భక్తులు పితృదేవతలకు తర్పణాలు, పిండప్రదానాలు నిర్వహించడంతో పాటు కొబ్బరికాయలు కొట్టడం, ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని, ఈ సందర్భంగా ప్లాస్టిక్‌ కవర్లు, ఇతర ప్లాస్టిక్‌ వస్తువులు గోదావరి జలాల్లో కలవకుండా భక్తులకు అవగాహన కల్పించి, ప్రత్యామ్నాయ పద్ధతులను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని, జలాల్లో కలిసిన ప్లాస్టిక్ వస్తువులను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ సూచించారు.గోదావరి పుష్కరాలకు లక్షలాదిగా యాత్రికులు వచ్చే పరిస్థితుల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. విఐపి, వివిఐపిలకు ప్రత్యేకంగా బారికేడ్స్ , స్నానఘట్టాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో గతంలో జరిగిన తోపులాట అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీస్ శాఖ అధికారులు మంత్రులకు వివరించారు. ఐ అండ్ పిఆర్ తరఫున ప్రచార కార్యక్రమాలను గోదావరి పుష్కరాల ప్రారంభానికి ముందు నుంచే ప్రారంభించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ కమిషనర్ ముకుంద రెడ్డికి సూచించారు.గోదావరి పుష్కరాల ప్రారంభానికి ముందే గోదావరి నదీ తీరంలోని భద్రాచలం, ధర్మపురి వంటి ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో పుష్కర ఏర్పాట్లను సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్  రావు అధికారులను ఆదేశించారు. పుష్కరాల సమయంలో పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక బస్ షెల్టర్లు, ప్రయాణికుల వెయింటింగ్ ఏర్పాట్లు, పార్కింగ్ తదితర సౌకర్యాలను  తీర్చిదిద్దాలని, శాశ్వత ఆర్టీసీ బస్ స్టేషన్లు లేని ప్రాంతాల్లో తాత్కాలిక బస్ స్టేషన్లు, ప్రయాణికుల హోల్డింగ్ ఏరియాలు, పార్కింగ్ సదుపాయాలు  తదితర ఏర్పాట్లను ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టిసి అధికారులకు నిర్దేశించారు. గోదావరి పుష్కరాలను ప్రతిబింబించేలా బస్ స్టేషన్లను సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలను ముందుగానే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఘాట్లు, గ్రామాల పరిసరాల్లో పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షిస్తూ, పుష్కరాల కాలం పూర్తయ్యే వరకు పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఘాట్ల వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు అవసరమైన సిబ్బంది, వనరులను అందుబాటులో ఉంచాలని అన్నారు. పుష్కరాల ఏర్పాట్లలో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ, నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్ర కేబినేట్ తీర్మానాలు _

*తెలంగాణ రాష్ట్ర కేబినేట్ తీర్మానాలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 14:

రేపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అందుకు సంబంధించి అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. గతంలో రాష్ట్రంలో 2 కోట్ల 81 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులుంటే.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేసింది. కొత్తగా కుటుంబీకుల పేర్లను కూడా నమోదు చేసింది. 62 లక్షల మందికి కొత్తగా లబ్ధి చేకూర్చింది. రాష్ట్రంలో ఈరోజుకు మొత్తం 3 కోట్ల 42 లక్షల మంది రేషన్ లబ్ధిదారులున్నారు. వీరికి స్మార్ట్ కార్డుల జారీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.గత ఏడాది నిర్వహించినట్లే.. ఈ ఏడాది కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహణకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో సదస్సు నిర్వహించాలని ప్రాధమికంగా తేదీలను నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి,  వివేక్ వెంకటస్వామి అధ్వర్యంలో సబ్ కమిటీతో పాటు సదస్సు నిర్వహణకు  ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గత ఏడాది తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను ఆవిష్కరించినట్లే.. ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్ తో సదస్సు నిర్వహణకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ ప్లాన్ ఆవిష్కరించనుంది. ప్రధానంగా మన రాష్ట్రంలో డిఫెన్స్, ఏరో స్పేస్, ఫార్మా రంగాల్లో పరిశ్రమలు, పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈసారి సదస్సు జరుగుతుంది. వివిధ రంగాల్లో ఇప్పటికే తెలంగాణ స్టార్టప్ లు, పరిశ్రమలు సాధించిన విజయాలు.. వివిధ రంగాల కొత్త ఆవిష్కరణలకు సంబంధించి ఎగ్జిబిషన్, స్టాళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 
వానాకాలం పంట‌కు సంబంధించి ఏడు ర‌కాల స‌న్న ధాన్యం సాగును ప్రోత్సహించి, ఆ ఏడు ర‌కాల సాగును పెంచడానికి రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలని కేబినేట్ నిర్ణయించింది.  రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ భవనాలు, రైతు వేదిక‌ల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి ఈ ఏడు ర‌కాల స‌న్నాల‌కే రూ.500 బోన‌స్‌ చెల్లించాల‌ని కేబినేట్ తీర్మానించింది.యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 81.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులకు కనీస మద్ధతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో 63.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుంది. మిగతా 17.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ వేలం ద్వారా విక్రయించేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. ఇటీవల మొక్కజొన్న వేలంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం రాబ‌ట్టుకున్న నేప‌థ్యంలో ఈ మిగులు ధాన్యానికి కూడా క్వింటాలుకు రూ.2389 బేసిక్ ప్రైస్ నిర్ణయించి.. ఈ వేలం (e-Auction) ద్వారా ధాన్యం అమ్మాలని కేబినేట్ నిర్ణయించింది.రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోకి తీసుకురావ‌డానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ క‌ళాశాల‌లు సాంకేతిక విద్యా శాఖ ప‌రిధిలో ఉన్నాయి. వీటిని తెలంగాణ ఎడ్యుకేష‌న్ యాక్ట్ నుంచి తొల‌గించి  యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) పరిధిలో చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న వీటన్నింటినీ ఇకపై శక్తి శాఖ పరిధిలోకి విలీనం చేసేందుకు క్యాబినెట్ తీర్మానించింది.ఆదిలాబాద్‌, నిర్మల్, ముధోల్‌, బోథ్‌, సిర్పూర్‌, గజ్వేల్, దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో తొలివిడ‌త‌గా 113 నియోజ‌క‌వ‌ర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూల్ కాంప్లెక్స్లో నిర్మించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు కొత్తగా ఆమోదించిన 7 స్కూళ్లతో కలిపి ఇప్పటివరకు 86 యంగ్ ఇండియా రెసిడెన్సియల్ స్కూల్ కాంప్లెక్స్ లకు అనుమతులు మంజూరయ్యాయి. మిగిలిన నియోజకవర్గాల్లోనూ వీలైనంత తొందరగా స్థల సేకరణ చేసి, నిర్మాణాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూళ్లను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. నిర్మాణాలు పూర్తయిన చోట వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించి.. హైదరాబాద్ ను గ్రీన్ సిటీగా మార్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో ప్రస్తుతం 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోరిక్షాలున్నాయి. వీటిని ఈవీ (విద్యుత్తు వాహనాలుగా) మార్చేందుకు రూ.200 కోట్లతో ప్రత్యేక పథకం (తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్) అమలుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద  అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒక్కో వాహనానికి గరిష్ఠంగా రూ.1 లక్ష 50 వేలు సబ్సిడీ అందిస్తారు.  ప్రస్తుతం ఉన్న ఆటోకు విద్యుత్ కిట్ అమర్చుకోవటం లేదా పాత వాహనాన్ని స్క్రాప్ చేసి కొత్త విద్యుత్ ఆటో కొనుగోలు చేసుకునేందుకు ఈ పథకం ద్వారా అవకాశం కల్పించనున్నారు.హైదరాబాద్ సిటీ పరిధిలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను సిటీ శివార్లకు తరలించేందుకు ఉద్దేశించిన HILT పాలసీ దరఖాస్తుల గడువును మరో 3 నెలలు పొడిగించేందుకు కేబినెట్ నిర్ణయం. దరఖాస్తుదారుల విజ్ఞప్తుల మేరకు అక్టోబర్ 31 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోత‌ల ఫేజ్‌-II పనుల కోసం రూ. 2,100 కోట్ల అంచనా వ్యయానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.  దీంతో దాదాపు ల‌క్ష ఎక‌రాల‌కు సాగు నీరు, ఆ ప్రాంతంలో తాగు నీరు, పారిశ్రామిక అవ‌స‌రాల‌కు ఈ ఎత్తిపోత‌ల నుంచి అందుతుంది. 
గూడెం దొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు సామ‌ర్థ్యాన్ని 1.19 టీఎంసీ నుంచి 15 టీఎంసీల‌కు పెంచటంతో పాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ ను నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

సేవా పతక గ్రహీతలు డీసీపీ జే.నర్సయ్య మరియు సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ఆర్‌జీ శివమారుతిలను సన్మానించిన సీపీ సజ్జనర్‌

*హైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు సేవా పతకాలు*

*సేవా పతక గ్రహీతలు డీసీపీ జే.నర్సయ్య మరియు సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ఆర్‌జీ శివమారుతిలను సన్మానించిన సీపీ సజ్జనర్‌*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 14:

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ప్రకటించిన ప్రతిష్ఠాత్మక సేవా పతకాలకు ఎంపికైన అధికారులను హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్ ఘనంగా సత్కరించారు. రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపికైన సికింద్రాబాద్‌ జోన్‌ అదనపు డీసీపీ జే.నర్సయ్య, విశిష్ట సేవా పతకం వరించిన సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ఆర్‌జీ శివమారుతిలను శుక్రవారం సీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనర్‌ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అంకితభావం, అత్యుత్తమ నిబద్ధత ప్రదర్శించినందుకే అధికారులకు ఈ అత్యున్నత పురస్కారాలు దక్కాయని కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో అదనపు డీసీపీ నర్సయ్య, సైబర్‌ నేరాల నియంత్రణ, సాంకేతిక దర్యాప్తులో ఏసీపీ శివమారుతి కనబరిచిన ప్రతిభ ప్రశంసనీయమన్నారు.జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక పతకాలు సాధించడం ద్వారా హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ కీర్తిప్రతిష్ఠలను మరింత పెంచారని, వీరి సేవలు ఇతర పోలీసు అధికారులకు, సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే అంకితభావంతో ప్రజాసేవలో కొనసాగుతూ మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
అధికారుల విశేష సేవల నేపథ్యం
*(1)* : అదనపు డీసీపీ జే.నర్సయ్య:1991లో ఎస్సైగా చేరి 35 ఏళ్లుగా సుదీర్ఘ సేవలందిస్తున్నారు. పలు కీలక కేసుల దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. గతంలో ఈయన ‘ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌’ (ఐపీఎం) సహా పలు పతకాలు అందుకున్నారు.
*(2)*:  సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ఆర్‌జీ శివమారుతి:1995లో ఎస్సైగా చేరి 31 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. రూ.127 కోట్ల పాన్‌-ఇండియా సైబర్‌ మోసాల నెట్‌వర్క్‌ను ‘ఆపరేషన్‌ ఆక్టోపస్‌’ ద్వారా ఛేదించి గుర్తింపు పొందారు. దర్యాప్తులో ప్రతిభకు గాను 2022లో ‘కేంద్ర హోంమంత్రి పతకం’ సాధించారు.
ఈ కార్యక్రమంలో అదనపు సీపీ యం.శ్రీనివాస్‌, ఐపిఎస్, జాయింట్‌ సీపీ (ఎస్‌బీ), నార్త్‌ రేంజ్‌ శాంతిభద్రతల జాయింట్‌ సీపీ ఎస్‌.ఎం.విజయ్‌కుమార్‌, ఐపీఎస్, డీసీపీలు కిరణ్ ఖారే ఐపిఎస్ (చార్మినార్ జోన్), ఎస్. శ్రీనివాస ఐపిఎస్ (రాజేంద్రనగర్ జోన్), ఎమ్. చైతన్య కుమార్ ఐపిఎస్ (డీడీ), శ్రీమతి లావణ్య నాయక్ జాదవ్ (వుమెన్ సేఫ్టీ వింగ్), డి. రాజేష్ (శంషాబాద్ జోన్), జె. రాఘవేందర్ రెడ్డి (గోల్కొండ జోన్), ఎ. రమణా రెడ్డి (జూబ్లీహిల్స్)  తదితర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని పతక గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు.

వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి పౌరుడు తప్పక తోడ్పడాలి: గౌరవనీయ గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా_

*తెలంగాణ లోక్ భవన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*

*వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి పౌరుడు తప్పక తోడ్పడాలి: గౌరవనీయ గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 15:

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, ధైర్యం, దేశభక్తి నుండి స్ఫూర్తి పొంది, అభివృద్ధి చెందిన, ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ధిగల, సుసంపన్నమైన భారతదేశ నిర్మాణానికి తోడ్పడాలని పౌరులకు పిలుపునిచ్చారు.లోక్ భవన్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జాతీయ జెండాను ఎగురవేసి, లాంఛనప్రాయ వందనం స్వీకరించారు.భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశానికి అతిపెద్ద బలమని ఆయన అన్నారు. ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, ఆవిష్కరణ రంగాలలో హైదరాబాద్ గణనీయమైన పురోగతి సాధిస్తుండగా, తెలంగాణ ఒక కీలక వృద్ధి చోదకంగా ఆవిర్భవించిందని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు.
టీబీ ముక్త్ భారత్, నషా ముక్త్ భారత్‌లను విస్తృత ప్రజా ఉద్యమాలుగా మార్చాల్సిన అవసరాన్ని గవర్నర్ నొక్కిచెప్పారు. క్షయవ్యాధి నిర్మూలనకు, మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి పౌరులు, సంస్థలు, యువత కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కోరారు.
సాయుధ దళాలకు, భద్రతా సిబ్బందికి నివాళులర్పిస్తూ, వారి అప్రమత్తత, శౌర్యం, త్యాగాల వల్లే దేశం ఆత్మవిశ్వాసంతో పురోగమిస్తుందని ఆయన అన్నారు.వికసిత్ భారత్ దార్శనికతతో పాటు ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ధిగల, సుసంపన్నమైన తెలంగాణను నిర్మించడానికి సమిష్టి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మింట్ కాంపౌండ్‌లో ఘనంగా టీజీఎస్పీడీసీఎల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు_

*మింట్ కాంపౌండ్‌లో ఘనంగా టీజీఎస్పీడీసీఎల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 15

దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో గల టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయులు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, విద్యుత్ వినియోగదారులకు, టీజీఎస్పీడీసీఎల్ ఉద్యోగులు, ఇంజినీర్లు, కార్మికులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
నాణ్యమైన విద్యుత్ సేవలే సంస్థకు ప్రతిష్టను తీసుకొస్తాయి.
వినియోగదారులకు నాణ్యమైన, విశ్వసనీయమైన మరియు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ ఉద్యోగులు, ఇంజినీర్లు మరియు సిబ్బంది చేస్తున్న కృషిని సీఎండీ అభినందించారు. విద్యుత్ రంగంలో సంస్థకు మరింత గుర్తింపు, మంచి పేరు తీసుకురావడానికి ఇదే స్ఫూర్తి, అంకితభావం మరియు నిబద్ధతతో పనిచేయాలని ఆయన సూచించారు.
వినియోగదారుల సంతృప్తికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, వారికి ఎలాంటి జాప్యం, అసౌకర్యం లేకుండా విద్యుత్ సేవలు అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని సీఎండీ స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాలో నాణ్యత, విశ్వసనీయతను మరింత మెరుగుపరచడంతో పాటు, వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గోల్కొండ కోటలో రాష్ట్ర స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
అనంతరం టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ గోల్కొండ కోటలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అధికారిక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) డా. ఎన్. నర్సింహులు, డైరెక్టర్ (ఫైనాన్స్)  చక్రపాణి, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) వి. శివాజీ, డైరెక్టర్ (హెచ్‌ఆర్ & ఫైనాన్స్) కృష్ణారెడ్డి, మెద్చల్–మల్కాజిగిరి చీఫ్ ఇంజినీర్, హెచ్‌ఆర్ విభాగం అధిపతి శ్రీ బిక్షపతి, కార్పొరేట్ కార్యాలయ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, ఉద్యోగులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

గాంధీ భవన్‌లో జాతీయ పతాకావిష్కరణ_

*గాంధీ భవన్‌లో జాతీయ పతాకావిష్కరణ*

*రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: మహేష్ కుమార్ గౌడ్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 15

గాంధీ భవన్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జనరల్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవం దేశంలోనే గొప్ప పండగ అని, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే జాతీయ పండగ అని అన్నారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందని పేర్కొన్నారు.మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దేశ చరిత్రను యువత సమగ్రంగా అధ్యయనం చేయాలని, ముఖ్యంగా నేటి జెన్‌-జీ తరం చరిత్రపై అవగాహన పెంచుకోవాలని అన్నారు.కుల, మతాల పేరుతో జరుగుతున్న చిచ్చు నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రశ్నించే హక్కు, ప్రశ్నించే స్వేచ్ఛ ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్య్రం సాకారమవుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.పరిపాలన కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైతే ప్రజాస్వామ్యం పరిఢవిల్లదని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తీవ్రవాదులుగా ముద్ర వేయడం సరైన విధానం కాదని విమర్శించారు. బీజేపీ నియంతృత్వ వైఖరిని ప్రతి పౌరుడు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశాన్ని సమగ్రంగా అర్థం చేసుకునే అవకాశం కల్పించిందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జోడో యాత్ర స్ఫూర్తితో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కులగణన సర్వే నిర్వహించామని తెలిపారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన అప్పులపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని, సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పుల అంశాన్ని ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. వాస్తవాలకు దూరంగా సోషల్ మీడియాలో జరుగుతున్న విషప్రచారాన్ని అరికట్టాలని, యువత నిజానిజాలను తెలుసుకుని చైతన్యవంతంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రశ్నపత్రాల లీకేజీలకు ఎవరు బాధ్యులనే అంశంపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ వంటి నాయకుల పాత్రను గుర్తు చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశం ఆశ్చర్యపోయేలా ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ముఖ్యంగా పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని, తెలంగాణలో అమలవుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

రామంతాపూర్ వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు_

*రామంతాపూర్ వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 15:

రామంతాపూర్ వెంకట సాయి నగర్ కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా, దేశభక్తి వాతావరణంలో నిర్వహించారు. కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఐకమత్యాన్ని చాటుకున్నారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు విజయేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తిని చాటుకున్నారు.
ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. కాలనీ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారతదేశ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
ఒకే కుటుంబంలా కాలనీ ప్రజలందరూ కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశం కోసం సేవలందిస్తున్న సైనికులు, పోలీసు సిబ్బంది, ప్రజాసేవకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రగతిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, దేశ సమగ్రతను కాపాడుతూ బాధ్యతాయుతమైన పౌరులుగా ముందుకు సాగాలని కోరారు. అనంతరం కాలనీ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాలనీ గౌరవ సభ్యులు రమేష్ గౌడ్, ఎం. రవికుమార్, గోపాల్ యాదవ్, సర్వ సత్తయ్య యాదవ్, శివ శంకర్, సంజీవ్, కమిటీ సభ్యులు ఆర్. గోవింద్, జి. అశోక్, శ్రీనివాస్ గౌడ్, కే. నవీన్ కుమార్, భూపతి రాములు గౌడ్, డాక్టర్ విద్యాసాగర్, రామకృష్ణ, శివకుమార్, బి. చలపతిరావు, రమేష్ శెట్టి, స్వామి, మాసయ్య, వేణుగోపాల్ రెడ్డి, హరీష్, శేఖర్, సాయికుమార్, ఆంజనేయులు, చంద్రం చారి, సిద్ధు గౌడ్, గణేష్, బాల కొమరయ్య, వెంకట స్వామి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.